King Charles: కింగ్‌ ఛార్లెస్‌కు పట్టాభిషేకం.. ఆనంద్‌ మహీంద్రా స్పందన ఇదే!

బ్రిటన్‌ రాజుగా కింగ్‌ ఛార్లెస్‌-3 పట్టాభిషిక్తుడు కావడం చాలా సంతోషంగా ఉందని మహీంద్రా గ్రూప్‌ సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా అన్నారు. కింగ్‌ ఛార్లెస్‌ను అభినందిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.

Published : 07 May 2023 20:45 IST

ముంబయి: బ్రిటన్‌ రాజుగా కింగ్‌ ఛార్లెస్‌-3 పట్టాభిషిక్తుడు కావడంపై మహీంద్రా గ్రూప్‌ సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ఆయన్ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. 74 ఏళ్ల కింగ్‌ ఛార్లెస్‌-3ని కేవలం రాజుగానే కాకుండా వ్యక్తిగతంగానూ యావత్‌ ప్రపంచం గుర్తుంచుకుంటుందని అన్నారు.. ‘‘ మీ కిరీటం కంటే ప్రజలు మిమ్మల్నే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. వ్యక్తిగతంగా మీకున్న గుర్తింపు అలాంటిది. అందరికీ ఉత్తమ భవిష్యత్‌ను అందించేందుకు మీరు చేస్తున్న కృషి, పనిపట్ల మీకున్న నిబద్ధతే ఇందుకు కారణం’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఈ భూ గ్రహాన్ని కాపాడేందుకు ఇంకా సమయం కేటాయిస్తారన్న విశ్వాసం తనకుందని చెప్పారు.

ది సస్టెయినబుల్‌ మార్కెట్స్‌ ఇనిషియేటివ్‌ (ఎస్‌ఎంఐ)లో కింగ్‌ ఛార్లెస్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తు చేసుకున్న ఆనంద్‌ మహీంద్రా.. భవిష్యత్‌లోనూ దానిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో శనివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగిన పట్టాభిషేకం కార్యక్రమంలో ఛార్లెస్‌-3 సింహాసనాన్ని అధిష్ఠించారు. బ్రిటన్‌ సామ్రాజ్యానికి 40వ రాజుగా ప్రమాణం చేశారు. దాదాపు  2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘నేను సేవలు చేయించుకోవడానికి రాలేదు.. సేవ చేయడానికి వచ్చాను’ అంటూ ప్రమాణస్వీకారం సందర్భంగా కింగ్‌ ఛార్లెస్‌-3 అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని