లష్కరే కమాండర్‌ను మట్టుపెట్టిన సైన్యం.. 7 రోజుల సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌కు ముగింపు

Anantnag encounter: ఎట్టకేలకు లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్‌ కథ ముగిసింది. మంగళవారం అతడిని హతమార్చినట్లు భద్రతాసిబ్బంది తెలిపారు.  

Updated : 19 Sep 2023 16:52 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడురోజులుగా జరుగుతోన్న ఎన్‌కౌంటర్ కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌(Lashkar commander Uzair Khan)ను హతమార్చడంతో ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసింది. అతడిని మట్టుపెట్టిన విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్‌ కుమార్ ధ్రువీకరించారు. ఇప్పటికీ గాలింపు కొనసాగుతోందని, ప్రజలు అటువైపుగా వెళ్లొద్దని కోరారు. (Anantnag encounter)

కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్ ఖాన్‌ది అని తెలిపారు. అనంతనాగ్‌(Anantnag) జిల్లాలోని కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు భద్రతా సిబ్బంది గత మంగళవారం వేట మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజు(సెప్టెంబర్‌ 13) ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది.

ఉగ్రపుట్టగా పీర్‌ పంజాల్‌.. రోజుల తరబడి ఎన్‌కౌంటర్లు..!

దీంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్‌ భట్‌లు అమరులయ్యారు. అదే ఘటనలో ఓ జవాన్ ఆచూకీ గల్లంతయ్యింది. సెప్టెంబర్ 18 ఆ జవాను భౌతికకాయాన్ని పోలీసులు గుర్తించారు. అతడు పంజాబ్‌కు చెందిన సిపాయి ప్రదీప్‌ కుమార్‌ అని అధికారులు తెలిపారు. గత దశాబ్దకాలంలో సుదీర్ఘంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఇదేనని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఉజైర్‌ అనంత్‌నాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు 26 జులై 2022 నుంచి ఆచూకీ లేడని తెలుస్తోంది. లష్కరే కమాండర్‌గా ఉన్న అతడి కథ ఈ రోజుతో ముగిసిపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని