Zika Virus: కేరళలో చాపకింద నీరులా ‘జికా’

కరోనాతో వణుకుతున్న కేరళలో జికా వైరస్‌ కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయి.......

Published : 13 Jul 2021 20:12 IST

కొత్తగా మరో మూడు కేసులు

తిరువనంతపురం: కరోనాతో వణుకుతున్న కేరళలో జికా వైరస్‌ కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22కి చేరినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన 38 ఏళ్ల వైద్యుడికి జికా సోకినట్టు కోయంబత్తూరు ల్యాబ్‌ నిర్ధారించినట్టు ఆమె తెలిపారు. అలాగే, వైరస్‌ సోకినవారిలో 35 ఏళ్ల వ్యక్తితో పాటు 41 ఏళ్ల మహిళ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 

వీరి శాంపిల్స్‌ను ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌తో పాటు కోయంబత్తూరుకు చెందిన ఓ ల్యాబ్‌లో పరీక్షించినట్టు తెలిపారు. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో జికా వైరస్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైనట్టు తెలిపారు.

జికా వైరస్‌ ఏడెస్‌ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్‌ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని