Lokpal: లోక్‌పాల్‌ కొత్త చీఫ్‌ నియామకానికి కేంద్రం కసరత్తు!

భారత తొలి లోక్‌పాల్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో నూతన చీఫ్‌ నియామకంపై కేంద్రం దృష్టిసారించింది. 70 ఏళ్లు పూర్తవుతున్న.....

Published : 17 May 2022 01:48 IST

దిల్లీ: భారత తొలి లోక్‌పాల్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో నూతన చీఫ్‌ నియామకంపై కేంద్రం దృష్టిసారించింది. ఆయనకు 70 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ నెల 27తో ఆయన పదవీ కాలం ముగియనుండటంతో నియామక ప్రక్రియకు కసరత్తు మొదలు పెట్టినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2019 మార్చిలో భారత తొలి లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌తో పాటు మరో ఎనిమిది మంది సభ్యులు (నలుగురు జ్యుడీషియల్‌/నలుగురు నాన్‌ జ్యుడీషియల్‌)తో రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే, 1952 మే 28న జన్మించిన జస్టిస్‌ పినాకి ఘోస్‌కు 70 ఏళ్లు పూర్తికానుండటంతో నిబంధనల ప్రకారం ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. దీనికితోడు జస్టిస్‌ దిలిప్‌ భోసలే 2020 జనవరిలో వ్యక్తిగత కారణాల రీత్యా లోక్‌పాల్‌ సభ్యుడిగా రాజీనామా చేయగా.. మరో సభ్యుడు జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠి 2020 మే 2న గుండెపోటుతో మరణించడంతో ప్రస్తుతం ఇద్దరు జ్యుడిషియల్‌ సభ్యులతో పాటు ఆరుగురు మాత్రమే ఉన్నారు. గత రెండేళ్లుగా రెండు జ్యుడిషియల్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మరోవైపు, కొన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా లోక్‌పాల్‌కు దాదాపు 4,244 అవినీతి ఫిర్యాదులు అందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం ఫిర్యాదులు ఏప్రిల్‌ 2021 నుంచి జనవరి 31, 2022 వరకు వచ్చాయని తెలిపాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఫిర్యాదులు దాదాపు 80శాతం అధికంగా రావడం గమనార్హం. 

ఏమిటీ లోక్‌పాల్‌?
కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. పబ్లిక్‌ సర్వెంట్లలో కొన్ని విభాగాల వారిపై వచ్చే అవినీతి కేసులపై దృష్టిపెట్టడం వీటి విధి.
* లోక్‌పాల్‌ కమిటీలో ఒక ఛైర్మన్‌, గరిష్ఠంగా 8 మంది సభ్యులు ఉండాలి. వీరిలో నలుగురు జ్యుడిషియల్‌ సభ్యులై ఉండాలి.
* లోక్‌పాల్‌లో కనీసం 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా విభాగానికి చెందినవారై ఉండాలి.
* ఛైర్‌పర్సన్‌, ఇతర సభ్యులు ఐదేళ్లు లేదా 70 ఏళ్లు వయసు వచ్చేవరకూ పదవుల్లో కొనసాగుతారు.
* ఛైర్మన్‌ జీత భత్యాలు భారత న్యాయమూర్తి తరహాలోనే ఉంటాయి.
* సభ్యుల జీత భత్యాలు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఇచ్చే రీతిలో ఉంటాయి.
* లోక్‌పాల్‌ ఎంపిక కమిటీకి ప్రధాన మంత్రి నాయకత్వం వహిస్తారు. లోక్‌సభ స్పీకర్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ప్రతిపాదించిన న్యాయమూర్తి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రపతి లేదా మరేదైనా ఇతర సభ్యుడు నామినేట్‌ చేసిన ప్రముఖ న్యాయకోవిదుడు కూడా సభ్యుడిగా ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని