Corona: బలగాలకు అత్యవసర అధికారాలు

దేశంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ సాయుధ దళాలకు కేంద్రం అత్యవసర ఆర్థిక అధికారాలను కల్పించింది. దీని ద్వారా వైద్యసేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను..

Published : 30 Apr 2021 22:40 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ సాయుధ దళాలకు కేంద్రం అత్యవసర ఆర్థిక అధికారాలను కల్పించింది. దీనిద్వారా వైద్యసేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను, వసతులను సమకూర్చుకునేందుకు సైన్యానికి వెసులుబాటు లభించనుంది. రెండో దశలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట్ల సాయుధ బలగాల సేవలను వినియోగించుకోవచ్చని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. ఆయా అవసరాల మేరకు రాష్ట్రాలతో కలిసి పని చేయాలని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వారికి కొన్ని అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా రాష్ట్రంతో సంబంధం లేకుండా కొంత సొమ్ము వెచ్చించి ప్రజలకు వైద్య సదుపాయాలను అందించేందుకు సైన్యం కొన్ని ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు, వైద్యపరికరాలు సమకూర్చుకోవడం తదితరాలకు అయ్యే ఖర్చులను కమాండ్‌ స్థాయి అధికారులే స్వయంగా ఖర్చు చేసే వీలు ఉంటుంది. ఈ మేరకు రక్షణ మంత్రి కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. ‘‘ కరోనా సంక్షోభ సమయంలో ఇండియన్‌ ఆర్మీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సాయుధ బలగాలకు అత్యవసర ఆర్థిక అధికారాలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు’’ అని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని