Budget 2023: సరిహద్దులకు మరింత ‘రక్షణ’.. అగ్నివీరులకు ‘పన్ను’ ఊరట

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులను పెంచారు. దీంతో పాటు అగ్నివీరులకు పన్ను మినహాయింపులు కల్పించారు.

Updated : 01 Feb 2023 18:07 IST

దిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. దేశ బడ్జెట్‌ (Budget 2023)లో రక్షణ రంగానికి (Defence Ministry) కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం కల్పించింది. సైనిక పరికరాల సాంకేతికతలో స్వావలంబనే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. హిమాలయాల్లో మిలిటరీ ఆధునీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం భారీగానే కేటాయింపులు చేసింది. గత ఐదేళ్లలో రక్షణ బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం. తాజా బడ్జెట్‌లో ఈ రంగానికి నిధులను 13శాతం పెంచింది. ముఖ్యంగా, ఆయుధాల కొనుగోళ్లకు నిధులను పెంచింది. దీంతో సబ్‌మెరైన్లు, డ్రోన్లు, యుద్ధ విమానాల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు బడ్జెట్‌లో బూస్ట్‌ ఇచ్చినట్లైంది. అటు సాయుధ దళాల్లో చేరే అగ్నివీరులకు పన్నుల నుంచి కాస్త ఉపశమనం కల్పించింది.

నిర్మలమ్మ (Nirmala Sitharaman) బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు ఇలా..

2023-24 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ (Defence Ministry) రంగానికి రూ.5,93,537.64 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన మొత్తం (రూ.5.25లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 13శాతం అధికం.

రూ.1.62లక్షల కోట్లను కొత్త ఆయుధాలు (Weapons), యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు (Warships), ఇతర సైనిక ఆయుధ సామగ్రి కొనుగోళ్లకు కేటాయించారు.

రెవెన్యూ వ్యయాల కోసం రూ.2,70,120కోట్లను కేటాయించారు. రక్షణ రంగ సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ, ఇతర మౌలికసదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు.

అత్యవసర పరిస్థితుల వేళ, సరిహద్దులకు జవాన్లు, ఆయుధాలను వేగంగా తరలించేందుకు వీలుగా హిమాలయాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. దీని కోసం సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌ఓ)కు ఈ బడ్జెట్‌లో నిధులను పెంచారు. హిమాలయాల్లో బ్రిడ్జ్‌ రోడ్లు, సొరంగాల నిర్మాణం కోసం రూ.4500కోట్లను కేటాయించారు.

రక్షణ రంగంలో పరిశోధనల కోసం రూ.12,850కోట్లను కేటాయించారు. దేశీయ తయారీ, పరిశోధనలకు ఊతమిచ్చేలా ఆర్‌అండ్‌డీ బడ్జెట్‌లో 25శాతం ప్రైవేటు పరిశ్రమలు పొందేలా వీలు కల్పించారు.

పింఛను (Pensions) వ్యయాల కోసం రూ.1,38,205కోట్లను కేటాయించారు.

డిఫెన్స్‌ మినిస్ట్రీ (సివిల్‌) శాఖకు రూ.8,774కోట్ల మూలధన వ్యయ కేటాయింపులు ప్రకటించారు.

మూలధన వ్యయం కింద రూ.13,837 కోట్లను పక్కనబెట్టారు.

ఈ బడ్జెట్‌లో అగ్నివీరుల (Agniveer)కు ఊరట కల్పించారు. ‘‘అగ్నివీర్‌ కార్పస్‌ ఫండ్‌’ నుంచి అగ్నివీరులు పొందే చెల్లింపులకు పన్నుల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు