ఆటో డ్రైవర్‌ ఆహ్వానం.. ఆటోలో ఇంటికెళ్లి భోజనం చేసిన సీఎం

పంజాబ్‌ పర్యటనలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. సీఎం తన ఇంటికి భోజనానికి రావాలని ఓ ఆటో డ్రైవర్‌ కోరగా..

Updated : 23 Nov 2021 15:02 IST

చండీగఢ్‌: పంజాబ్‌ పర్యటనలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. సీఎం తన ఇంటికి భోజనానికి రావాలని ఓ ఆటో డ్రైవర్‌ కోరగా.. అతడి ఆహ్వానాన్ని మన్నించారు కేజ్రీవాల్‌. స్వయంగా అతడి ఆటోలోనే డ్రైవర్‌ ఇంటికి వెళ్లారు. అతడితో పాటు నేలపై కూర్చుని భోజనం చేసి ఆటోడ్రైవర్‌ను సంతోషపెట్టారు. వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ సోమవారం లూధియానాలో పర్యటించారు. అక్కడ స్థానిక ఆటోడ్రైవర్లతో సమావేశమై.. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా దిలీప్‌ తివారీ అనే ఆటోడ్రైవర్‌ మైక్‌ తీసుకుని.. ‘‘సీఎంగారూ.. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చాలా మంది ఆటోడ్రైవర్లకు సాయం చేశారు. ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజనానికి రాగలరా? నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా’’ అని కేజ్రీవాల్‌ను కోరాడు. ఇందుకు వెంటనే కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘‘తప్పకుండా.. ఈ రాత్రికి ఓకేనా?’’ అని అడిగారు. దీంతో దిలీప్‌ ఎంతగానో సంతోషపడిపోయాడు. అయితే తనతో పాటు భగవంత్ మన్‌, హర్పాల్‌ సింగ్‌ను కూడా తీసుకురావొచ్చా? అని కేజ్రీవాల్‌ అడగ్గా.. ఆటోడ్రైవర్‌ ఆనందంగా తలూపాడు. దీంతో సభ చప్పట్లతో మార్మోగింది. 

సమావేశం పూర్తయిన తర్వాత కేజ్రీవాల్‌, భగవంత్‌, హర్పాల్‌ సింగ్‌.. దిలీప్‌ తివారీ ఆటోలో అతడికి ఇంటికి వెళ్లారు. అతడి కుటుంబసభ్యులతో కాసేపు సరదగా గడిపారు. నేలపై కూర్చుని భోజనం చేశారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ కుటుంబం ప్రేమాభిమానాలకు ముగ్ధుడినయ్యానని, భోజనం చాలా బాగుందని అన్నారు. ఆటోడ్రైవర్‌ కుటుంబాన్ని దిల్లీలోని తన ఇంటికి రావాలని ఆహ్వానించినట్లు సీఎం వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమ్‌ ఆద్మీ పార్టీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకోగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. సీఎం నిరాడంబరతను చూసి పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని