Delhi: డంపింగ్ యార్డ్‌కు చేరిన.. ఆప్‌, భాజపా రాజకీయాలు..!

భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. దిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో కమలం పార్టీ విఫలమైంది.

Updated : 27 Oct 2022 14:06 IST

దిల్లీ: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) ఎన్నికలు ఆప్‌, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. విజయం కోసం ఇరు పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో గాజీపుర్‌లోని చెత్తదిబ్బ రెండు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. అక్కడి చెత్త డంపింగ్‌ యార్డ్‌ వద్దకు గురువారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఆప్ కార్యకర్తలు స్పందించారు. 

ఇటీవల మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. దీనిని ఉద్దేశించి ఆప్‌ విమర్శలు చేసింది. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. దిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో కమలం పార్టీ విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా ఆందోళన చేపట్టం. ఒకసారి ఆ పార్టీ ఓటర్లు తమ సొంత పార్టీ గురించి మర్చిపోవాలి. మేం అధికారంలోకి వస్తే.. దిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని తీర్థయాత్రలకు  తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని దిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు.

భాజపా మాత్రం కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆప్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది.  అయితే, ఆ ఎన్నిక తేదీలను ఇంకా ప్రకటించలేదు. దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్‌కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్‌యార్డులకు చేరుకుంటున్నాయి. 

నేను ఎన్నిసార్లు రమ్మని అడిగినా రాలేదు: గంభీర్‌

స్థానిక ఎన్నికల ముందు గాజీపుర్ డంపింగ్ యార్డ్‌ వద్దకు కేజ్రీవాల్‌ వెళ్లడాన్ని ఎంపీ గౌతమ్‌ గంభీర్ విమర్శించారు. ‘2019 నుంచి ఆ చెత్త దిబ్బ వద్దకు ఎనిమిదిసార్లు వెళ్లాను. ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అడిగినా.. ఆయన మాత్రం రాలేదు. వర్షాల వచ్చినప్పుడు కప్పలు బెకబెకమన్నట్టుగా.. ఆయన ఎన్నికల ముందు దాని గురించి మాట్లాతున్నారు’అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఈ గాజీపుర్ చెత్త కుప్ప గంభీర్ నియోజకవర్గ పరిధిలోనిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని