Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌ను కావాలనే ఇరికించారు..!

ముంబయి తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండటంతో గతేడాది ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Updated : 23 Dec 2022 17:10 IST

దిల్లీ: క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని తాజా నివేదిక వెల్లడించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విజిలెన్స్ విభాగం దానిని రూపొందించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా పలు లోపాలను గుర్తించినట్లు పేర్కొంది.

‘ఈ డ్రగ్స్ కేసు విచారణలో ఏడెనిమిది మంది అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది. ఆర్యన్ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించినందున.. ఆ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయలేదు. అయితే ఇదంతా ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది’ అని ఆ నివేదిక వెల్లడించింది. అలాగే ఎన్‌సీబీ ముంబయి యూనిట్‌లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. ఈ నివేదికను దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సమర్పించింది. 

ముంబయి తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండటంతో గతేడాది ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో.. ఈ కేసులో ఎన్సీబీ అతడికి ఇటీవల క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు