Assam-Nagaland Border: బలగాలను ఉపసంహరించుకోనున్న ఇరు రాష్ట్రాలు

అస్సాం, మిజోరం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం తలపిస్తున్న నేపథ్యంలో.. అస్సాం-నాగాలాండ్‌ రాష్ట్రాల మధ్య శాంతి చర్చలు సాగాయి. నాగాలాండ్‌లోని దిమాపుర్‌లో భేటీ అయిన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు....

Published : 31 Jul 2021 21:39 IST

ప్రధాన కార్యదర్శుల మధ్య ఫలించిన శాంతి చర్చలు

దిమాపుర్‌: అస్సాం, మిజోరం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం తలపిస్తున్న నేపథ్యంలో.. అస్సాం-నాగాలాండ్‌ రాష్ట్రాల మధ్య శాంతి చర్చలు సాగాయి. నాగాలాండ్‌లోని దిమాపుర్‌లో భేటీ అయిన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు శాంతి చర్చల్లో పాల్గొనగా అవి ఫలించాయి. రెండు రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పేందుకు సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే వారు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. 24 గంటల్లోగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించారు.

శాంతి చర్చలు సఫలమైన నేపథ్యంలో అస్సాం  ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ‘అస్సాం-నాగాలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారే దిశగా అడుగులుపడ్డాయి. సరిహద్దుల్లోని బేస్ క్యాంపుల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చీఫ్ సెక్రటరీలు ఓ అవగాహనకు వచ్చారు. ఇదో చరిత్రాత్మక అడుగు. సరిహద్దులో శాంతిని పునరుద్ధరించడంలో అసోంతో కలిసి పనిచేసినందుకు సీఎం నెయ్‌ప్యూ రియోకు నా కృతజ్ఞతలు. అస్సాం తన అన్ని సరిహద్దులలో శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉంది. ఈశాన్య ప్రాంత సామాజిక, ఆర్థిక శ్రేయస్సు కోసం కృషి చేస్తుంది.’ అని పలు ట్వీట్లలో పేర్కొన్నారు.

అయితే అస్సాం, మిజోరం రాష్ట్ర సరిహద్దు గొడవ మరింత బిగుస్తోంది. కొద్దిరోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అస్సాంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఈనెల 26న స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు కాల్పులు జరపడంతో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని