Ragging: ర్యాగింగ్‌కు భయపడి.. రెండో అంతస్తు నుంచి దూకేసి..!

ర్యాగింగ్‌కు భయపడి అస్సాంలోని దిబ్రూగఢ్‌ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Updated : 28 Nov 2022 15:50 IST

దిస్పూర్‌‌: మన దేశంలో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. ఇంకా ఈ విష సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ర్యాగింగ్‌ పేరుతో కొన్ని చోట్ల విద్యార్థులు హద్దులు దాటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒడిశాలోని ఓ విద్యార్థినిని ర్యాగింగ్‌ పేరిట లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఇలాంటి ఘటనే తాజాగా అస్సాంలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ బాధితుడు అబ్బాయి కావడం గమనార్హం. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక, వారి నుంచి తప్పించుకునేందుకు దిబ్రూగఢ్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఆనంద్‌ శర్మ అనే విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దిబ్రూగఢ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైనట్లుగా భావిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. తాజా ఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. ర్యాగింగ్‌కు పాల్పడి  జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులను కోరారు. ఘటనపై  సమగ్రంగా దర్యాప్తు చేయాలని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత విద్యార్థికి అన్నిరకాల వైద్యసదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మద్యం తాగించి..హింసించేవారు: విద్యార్థి తల్లి

తన కొడుకును సీనియర్‌ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా వేధించేవారని బాధితుడి తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి డబ్బులు గుంజుకునే వారని, మొబైల్‌ లాక్కొని హింసించేవారని, కొన్నిసార్లు చంపేందుకు కూడా యత్నించారని అన్నారు. మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసేవారని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరించే వారని పోలీసులతో చెప్పారు. ‘‘ తీవ్రంగా ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ గత నాలుగు నెలలుగా చెప్తూనే ఉన్నాడు. రాత్రంతా ర్యాగింగ్‌ చేసి హింసించారని ఫోన్‌ చేసి చెప్పాడు.’’ అని బాధితుడి తల్లి వాపోయారు. మరోవైపు సీనియర్‌ విద్యార్థులు తనపై ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఈ నెల 17న హాస్టల్‌ వార్డెన్‌కు ఆనంద్‌ శర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని