INS Vikrant: ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించిన ఆస్ట్రేలియా ప్రధాని

భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌(INS Vikrant)ను ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంథోని అల్బనీస్‌ (Anthony Albanese) సందర్శించారు. 

Updated : 09 Mar 2023 20:40 IST

ముంబయి: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా(Australia) ప్రధాని ఆంథోని అల్బనీస్‌ (Anthony Albanese) భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ (INS Vikrant)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భారత నావికాదళ (Indian Navy) సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత నౌకపై ఉన్న యుద్ధ విమానంలో కాసేపు కూర్చున్నారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించిన తొలి విదేశీ ప్రధాని అల్బనీస్‌ కావడం విశేషం. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత్‌ పూర్తి దేశీయంగా నిర్మించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సందర్శనకు వచ్చాను. ఇక్కడకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ను ప్రధాన కేంద్రంగా ఉంచాలనే ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానానికి నా పర్యటన నిదర్శనం. ముందుచూపుతో రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు’’ అని అల్బనీస్ అన్నారు. 

ఈ సందర్బంగా ఆయన ఈ ఏడాది తర్వాత మలబార్‌ నౌకాదళ విన్యాసాలకు (Malabar Naval Exercise) ఆస్ట్రేలియా నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. అలానే భారత్‌ తొలిసారి ఆస్ట్రేలియా-అమెరికా సంయుక్తంగా నిర్వహించే టాలిస్మాన్‌ విన్యాసాల్లో (Talisman Sabre Exercise) పాల్గొననుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనా (China) దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్‌, అమెరికా, జపాన్‌లు సంయుక్తంగా చేపడుతున్న మలబార్‌ విన్యాసాల్లో 2020 నుంచి ఆస్ట్రేలియా కూడా పాల్గొంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బోర్డర్‌ - గావస్కర్‌ (Border-Gavaskar series) సిరీస్‌లో భాగంగా భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ను కాసేపు వీక్షించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని