Sudha Murthy: రాజకుటుంబీకులకు సుధామూర్తి పాదాభివందనం.. నెట్టింట చర్చ

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, రచయిత్రి సుధామూర్తి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఫొటోలో ఆమె

Published : 28 Sep 2022 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, రచయిత్రి సుధామూర్తి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఫొటోలో ఆమె రాజకుటుంబీకులకు పాదాభివందనం చేయడమే అందుకు కారణం. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి అది 2019 నాటి ఫొటో. మైసూరు రాజ్య చివరి మహారాజు జయచామరాజ వడియార్‌ శత జయంతి ఉత్సవాలకు సుధామూర్తి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో రాజకుటుంబానికి చెందిన ప్రమోద దేవి వడియార్‌కు సుధామూర్తి వంగి నమస్కారం చేస్తున్నట్లుగా ఉంది. ఫొటోలో ప్రముఖ నటి బి. సరోజా దేవి కూడా కన్పిస్తున్నారు. ఈ ఫొటో ఇప్పుడు ఎందుకు బయటికొచ్చిందో తెలియదు గానీ.. ప్రస్తుతం దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఓ ట్విటర్‌ యూజర్‌ ఈ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘మైసూరు రాజకుటుంబీకుల ముందు వంగి నమస్కరించిన సుధామూర్తి. ఆమె ఎందరికో రోల్‌ మోడల్‌గా ఉంటారు. కానీ, మన దేశంలో రాజకుటుంబీకులను పలకరించే సంప్రదాయం ఇంకా ఇలాగే కొనసాగుతోందా? లేదా వారి మీద గౌరవంతో ఆమె ఇలా చేశారా?’’ అని ట్వీట్‌ చేశారు. అయితే, చాలా మంది సుధామూర్తి చర్యను తప్పుబడుతున్నారు. ఎంతోమందికి ఆదర్శప్రాయమైన ఆమె రాజకుటుంబీకుల ముందు ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా.. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ.. ఇతరుల పట్ల ఆమె చూపే గౌరవం అభినందనీయమని ప్రశంసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు