Azadi Ka Amrit Mahotsav: మహాత్ముని మంత్రపురి

అహ్మదాబాద్‌, దిల్లీ, బొంబాయి, మద్రాసులను కాదని... మారుమూల పల్లెటూరు శేగాంను తన ఆవాసంగా ఎంచుకున్నారు గాంధీజీ! అదే ఆయన  సామాజిక ప్రయోగాలకు వేదికైంది. జాతీయోద్యమానికి చివర్లో రాజధానైంది.

Updated : 17 Jun 2022 08:21 IST

అహ్మదాబాద్‌, దిల్లీ, బొంబాయి, మద్రాసులను కాదని... మారుమూల పల్లెటూరు శేగాంను తన ఆవాసంగా ఎంచుకున్నారు గాంధీజీ! అదే ఆయన  సామాజిక ప్రయోగాలకు వేదికైంది. జాతీయోద్యమానికి చివర్లో రాజధానైంది.

ప్పు సత్యాగ్రహ దండి యాత్ర తర్వాత... అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమాన్ని వీడిన గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఈ సందర్భంగానే... జాతీయోద్యమ కేంద్రం దేశం నడిబొడ్డున ఉంటే బాగుంటుందనుకున్నారు. తన అనుచరుడు, పారిశ్రామికవేత్త జమ్నాలాల్‌ బజాజ్‌ ఆహ్వానం మేరకు 1934లో మహారాష్ట్రలోని వార్ధాకు వచ్చారు గాంధీజీ. మగన్‌వాడీలో జమ్నాలాల్‌ ఇచ్చిన భవనంలో అఖిలభారత గ్రామీణ పరిశ్రమల సంఘం (ఏఐవీఐఏ)ను ఆరంభించారు. ఈ సంఘం ద్వారా... గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పరిశ్రమలు, వృత్తులు, కళలు, వ్యవసాయోత్పత్తుల్లో వినూత్న పద్ధతులు, శాస్త్రీయ పరిశోధన, గ్రామాల్లో స్వచ్ఛత, అంటరానితనం నిర్మూలనలాంటి... కార్యక్రమాలు చేపట్టారు.  దేశంలోని ప్రతి ఊరూ స్వయం సమృద్ధి సాధించేలా చేయాలనుకున్నారు.

రెండేళ్లపాటు మగన్‌వాడీ నుంచే కార్యకలాపాలు సాగాయి. కానీ గ్రామీణ పునర్నిర్మాణానికి తాను ఊర్లో సామాన్య రైతులాగే... జీవించాలని భావించిన గాంధీజీ... 10 కిలోమీటర్ల దూరంలోని మారుమూల పల్లెటూరు శేగాంను ఎంచుకున్నారు. ఎడ్లబండి మాత్రమే వెళ్లగలిగిన ఈ ఊరిలో చాలా భూమి జమ్నాలాల్‌ కుటుంబానిదే. ఆయన విరాళం ఇవ్వటంతో... 67 సంవత్సరాల వయసులో మహాత్ముడు అక్కడ కొత్త జీవితాన్ని ఆరంభించారు. పోస్ట్‌ ఆఫీస్‌ లేదు. దుకాణం లేదు. అనారోగ్యానికి అవసరమైతే మందులు కూడా దొరకవు.... ఎలాంటి సౌకర్యాలు, విలాసాల ప్రలోభం లేని ఈ చోటు నుంచి స్వతంత్ర భారతావని కోసం ఆయన ప్రణాళికలు రచించారు. తొలుత గాంధీ, కస్తూర్బా మాత్రమే ఉండాలనుకున్నారు. కానీ ఆయన వెంట అనివార్యంగా అనేక మంది అనుచరులు రావడంతో శేగాం కాస్తా జాతీయోద్యమ కేంద్రంగా మారింది. శేగాం పేరుతో మహారాష్ట్రలోనే మరో ఊరు కూడా ఉంది. దాంతో గాంధీ పేరిట వచ్చే ఉత్తరాలు (వార్దా నుంచి తీసుకొచ్చేవారు) ఇంకో శేగాంకు వెళ్లేవి. అందుకోసమే... దీనికి సేవాగ్రామ్‌గా పేరు మార్చారు గాంధీజీ! తొలి కుటీరం (ఆది నివాస్‌) నిర్మించేదాకా... వెదురు బొంగులతో కట్టిన తాత్కాలిక గుడిసెల్లోనే వారు నివాసం ఉన్నారు. తమ కుటీరాలను కూడా... అతి తక్కువ ఖర్చులో, 5కిలోమీటర్ల పరిధిలో లభించే సామగ్రితో, స్థానికుల సహకారంతో కట్టాలని గాంధీజీ షరతు పెట్టారు. ఖర్చు ఎట్టి పరిస్థితుల్లోనూ రూ. 100 దాటకూడదన్నారు. ఆయన ఓ పర్యటనకు వెళ్లి వచ్చేసరికల్లా.. కుటీరం సిద్ధమైంది. కానీ నిర్మాణానికి రూ.500 ఖర్చవటంతో ఆయన అసహనం వ్యక్తంజేశారు. జమ్నాలాల్‌ సర్దిచెప్పటంతో శాంతించారు.

సందర్శకులు, జాతీయోద్యమ కార్యకర్తల తాకిడి పెరగటంతో... ఆదినివాస్‌ నుంచి... మీరాబెన్‌ కోసం కట్టిన మరో కుటీరంలోకి¨ మారారు. దీన్నే బాపూ కుటీర్‌గా పిలుస్తారు. ఆశ్రమంలోని అన్ని కుటీరాలూ... పూరిళ్లే. విలాసాలకు దూరంగా ఉన్నవే. మహాత్ముడి కుటీరం సైతం అంతే. ఎలాంటి రక్షణ లేదు. భద్రత లేదు. తుపాకులు పట్టుకున్న అంగరక్షకులూ లేరు.

బ్రిటిష్‌ సామ్రాజ్య శత్రువు... నిర్భయంగా... నిరాడంబరంగా నీలాకాశం కింద పడుకోవటానికే ఇష్టపడేవారు. ఓరోజు తనను కలవటానికి వచ్చి, రాత్రి అక్కడే ఉండిపోయిన బ్రిటిష్‌ వైస్రాయ్‌ లిన్‌లిత్‌గోకు సైతం ఆరుబయటే మంచం వేయించారు.

బాపూ కుటీర్‌ నుంచే వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలకు వ్యూహరచన, నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, సామాన్యులు... ఇలా అంతా దేశంలోని ఓ మారుమూల పల్లెకు తరలివచ్చేవారు. ఒకరకంగా చెప్పాలంటే... సేవాగ్రామ్‌లోని బాపూ కుటీరం... అప్పటి భారతావని అనధికార రాజధానిగా మారింది. మహాత్ముడి అనుచరులు ‘దిల్లీ ఆంగ్లేయ రాజధాని అయితే... ఇది లోక్‌ధాని (ప్రజారాజధాని)’ అనేవారు. అందుకు తగ్గట్లుగానే... గాంధీజీతో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడటానికి వీలుగా... బ్రిటిష్‌ వైస్రాయ్‌ సేవాగ్రామ్‌లోని బాపూ కుటీర్‌కు తన నివాసానికి మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు చేయించారు.


‘నయీ తాలీమ్‌’ (కొత్త సాధన) పేరిట కొత్త విద్యా విధానాన్ని గాంధీజీ సేవాగ్రామ్‌ నుంచే ప్రతిపాదించారు. దానికి సంబంధించిన ప్రయోగాలను సేవాగ్రామ్‌లో చేసి చూపించారు. స్వాతంత్య్రానంతరం భారతావని ఈ విధానాన్ని అనుసరించాలని ఆయన ఆశించారు. జీవితం నుంచి... జీవితం కోసం.. జీవితాంతం నేర్చుకోవటమే నయీ తాలీమ్‌. మాతృభాష కేంద్రంగా... చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని, ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేలా దీన్ని రూపొందించారు. బాపూ చెప్పినట్లు ఈ మంత్రపురిలో ‘కోరికలు తీరకపోవచ్చుగాని... ప్రతి ఒక్కరి అవసరాలు తీరతాయి...!’ దేశం అనుసరించకున్నా సేవాగ్రామ్‌ మాత్రం ఇంకా ఆయన బాటలోనే నడుస్తోంది. 1946లో బెంగాల్‌లో మత కల్లోలాలను ఆపటానికి బయల్దేరిన ఆయన కోసం సేవాగ్రామ్‌ ఇంకా వేచిచూస్తూనే ఉంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని