Azadi Ka Amrit Mahotsav: సైన్యానికి జాతుల ముద్ర

భారత్‌లోని జాతి, కుల వ్యవస్థలతో ‘ఆడుకున్న’ ఆంగ్లేయులు సరికొత్తగా రెండు జాతులను సృష్టించారు. అవే పోరాడగల... పోరాడలేని జాతులు (మార్షల్‌ రేస్‌)! తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం

Updated : 22 Jun 2022 08:58 IST

భారత్‌లోని జాతి, కుల వ్యవస్థలతో ‘ఆడుకున్న’ ఆంగ్లేయులు సరికొత్తగా రెండు జాతులను సృష్టించారు. అవే పోరాడగల... పోరాడలేని జాతులు (మార్షల్‌ రేస్‌)! తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం ‘విభజించు-పాలించు’ సిద్ధాంతంలో భాగంగా భారతీయులకు ఈ ముద్ర వేశారు. ఆ విభజన ఆధారంగా కొన్ని వర్గాలు, ప్రాంతాలవారికే సైన్యంలో ప్రాధాన్యమిస్తూ... తమకు నచ్చని, మాట వినరనుకున్న వారిని పక్కనబెట్టారు.

వ్యాపారం కోసం భారత్‌కు వచ్చి, పగ్గాలు చేపట్టిన ఈస్టిండియా కంపెనీ తొలుత తెల్ల సైనికులను కొంతమందిని వెంట తెచ్చుకున్నా... తర్వాత స్థానికులకే జీతాలిచ్చి సిపాయిలుగా తీసుకుంది. పనికొస్తారనుకున్న అందరినీ నియమించేవారు. కానీ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ స్థానంలో భారత పాలనను చేతిలోకి తీసుకున్న బ్రిటిష్‌ సర్కారు వ్యూహం మార్చింది. భారతీయులందరికీ సైన్యంలో సమ ప్రాధాన్యం లేకుండా చేసింది. కొంతమందికే పెద్దపీట వేసింది. ఇందుకు కారణం- 1857 తిరుగుబాటే!

1857లో తెల్లవారిపై తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించింది బెంగాల్‌ సైనికులు. అందుకే... రాణి పాలన మొదలవగానే ఆంగ్లేయ యుద్ధ నిపుణుడు ఫ్రెడ్రిక్‌ స్లే రాబర్ట్స్‌ సిఫార్సుల మేరకు సైనిక భర్తీలో భారీ మార్పులు చేశారు. పీల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి... మాట వినే సామాజిక వర్గాలను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. తిరుగుబాటుకు కారణమైన బెంగాల్‌ సైన్యం రూపురేఖలు మార్చారు. ప్రాంతాలవారీగా కాకుండా సైన్యాన్ని జాతుల వారీగా విభజించారు. అంతేగాకుండా అంతగా చదువుకోని, ఆలోచించకుండా తమ ఆదేశాలు అమలు చేస్తూ, విశ్వాసపాత్రులుగా ఉండేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.  కానీ... భారత్‌లో పాలన పగ్గాలు చేపట్టేప్పుడు బ్రిటిష్‌ రాణి విక్టోరియా... భారతీయులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని... ఎలాంటి వివక్ష చూపించబోమంటూ హామీ ఇచ్చారు. కాబట్టి సైన్యంలో కొందరికే ప్రవేశమంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆంగ్లేయులు తమ ‘విభజన’ అస్త్రాన్ని ప్రయోగించారు. కులాలవారీగా పోరాట జాతులు, పోరాడలేని జాతులుగా ముద్ర వేశారు. శారీరక దృఢత్వానికి తోడు, తాము చెప్పినమాట వినేతత్వమున్న వారినే పోరాట జాతులని పేరుపెట్టి వారిని మాత్రమే సైన్యంలోకి తీసుకోవటం మొదలెట్టారు. (జలియన్‌వాలాబాగ్‌లో డయ్యర్‌ ఆదేశాలతో నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది గూర్ఖా రెజిమెంటే) పంజాబ్‌, గూర్ఖా, పఠాన్‌, రాజ్‌పూత్‌లకు సైన్యంలో పెద్దపీట వేశారు. పఠాన్‌లలో చాలామంది ఇతర కళలు, నైపుణ్యాలతో జీవనం సాగిస్తుంటే వారిని బలవంతంగా సైనిక అవసరాలకు మళ్లించారు. సైన్యంలో చేరటానికి ఇష్టంలేని వారిని కూడా... తమ నైపుణ్యాన్ని ఆయుధాల తయారీకి వినియోగించేలా ఒత్తిడి చేశారు. బెంగాలీలు, మరాఠాలు, దక్షిణాది వారిలో పోరాట పటిమ లేదని... వాయువ్య ప్రాంతాల్లోని వారే పోరాటయోధులని ఫ్రెడ్రిక్‌ రాబర్ట్స్‌ సూచించారు. అంటరాని కులాలనూ పోరాటాలకు పనికిరానివారిగా ఆయన ముద్రవేశాడు.
ఫలితంగా సిపాయిల తిరుగుబాటు అణచివేతలో తమకు సాయం చేసిన గూర్ఖా, సిక్కు, డోగ్రా, రాజ్‌పూత్‌, పఠాన్‌, బలూచీలకు బ్రిటిష్‌ సర్కారు పెద్దపీట వేసింది. 1857లో మాదిరిగా మళ్లీ సిపాయిలంతా కలసి తిరుగుబాటు చేయకుండా భారతీయుల్లోనే ఎక్కువ తక్కువ తారతమ్యాలను సృష్టించారు. ఒకవంక భారతీయ వర్ణ సిద్ధాంతాన్ని (అందులో క్షత్రియులు పోరాటశ్రేణి) అవహేళన చేస్తూనే... మళ్లీ అదే పద్ధతిలో పోరాట జాతి అంటూ కొత్తదాన్ని ఆంగ్లేయులు  సృష్టించటం గమనార్హం. 1895లో ఆయా రాష్ట్రాలవారీ సైన్యాలను రద్దు చేసి... జాతుల ఆధారంగానే సైనిక బెటాలియన్లను తయారు చేశారు. వీటి పగ్గాలను దిల్లీకి అప్పగించారు. 1862లో భారత సైన్యంలో 28శాతం పంజాబ్‌, వాయువ్య ప్రాంతాల నుంచి ఉండగా... 1914 నాటికి వారి సంఖ్య దాదాపు 60%కు చేరింది. దక్షిణాదివారి సంఖ్య 40శాతం నుంచి 11%కు పడిపోయింది. భారతీయ సిపాయిలపై ఆంగ్లేయులు అధికారులుగా ఉండి పెత్తనం చెలాయించేవారు.

అలాగని ఈ పోరాట జాతుల సిద్ధాంతానికే పూర్తిగా కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు. ప్రపంచ యుద్ధాలు వచ్చేసరికి... సిద్ధాంతాన్ని పక్కనబెట్టి అన్ని కులాలవారినీ సైన్యంలోకి తీసుకున్నారు. అంతేగాకుండా... అంతకుముందున్న అంటరానికులాల రెజిమెంట్లను (మహర్‌ రెజిమెంట్‌లాంటివి) పునరుద్ధరించారు. యుద్ధం ముగియగానే మళ్లీ రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తిరిగి ఆహ్వానించటం ఆంగ్లేయుల ద్వంద్వనీతికి నిదర్శనం. ఈ పోరాట జాతుల సిద్ధాంతాన్ని స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం 1949లో రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని