Azadi Ka Amrit Mahotsav: ఇట్లు మన అట్లీ...

క్లెమెంట్‌ రిచర్డ్‌ అట్లీ.... స్వతంత్ర భారత్‌ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన పేరిది. భారత్‌లో తమ 200 ఏళ్ల పాలనకు స్వస్తి పలకాలనే అనూహ్య నిర్ణయం తీసుకున్న బ్రిటన్‌ ప్రధాని ఈయనే! చర్చిల్‌లాంటి గుంటనక్కల అడ్డుపుల్లలను తొలగించుకుంటూ.

Updated : 04 Aug 2022 07:02 IST

క్లెమెంట్‌ రిచర్డ్‌ అట్లీ.... స్వతంత్ర భారత్‌ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన పేరిది. భారత్‌లో తమ 200 ఏళ్ల పాలనకు స్వస్తి పలకాలనే అనూహ్య నిర్ణయం తీసుకున్న బ్రిటన్‌ ప్రధాని ఈయనే! చర్చిల్‌లాంటి గుంటనక్కల అడ్డుపుల్లలను తొలగించుకుంటూ... భారత్‌లో ఆంగ్లేయ వలస పాలనకు చరమగీతం పాడారు అట్లీ.

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి... ఆక్స్‌ఫర్డ్‌లో చదివి, తండ్రికోసం న్యాయశాస్త్రంలో పట్టా పొందిన అట్లీ... (1883-1967) లాయర్‌ వృత్తి తనకు పొసగదని గుర్తించి 1914లో ఇంగ్లాండ్‌ సైన్యంలో చేరాడు. మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. అదే సమయంలో సైనికుడిగా బొంబాయికి వచ్చాడు. భారత్‌లో అదే ఆయన తొలి పర్యటన. తర్వాత 1927-28లో సైమన్‌ కమిషన్‌ సభ్యుడిగా వచ్చి... భారత జాతీయోద్యమాన్ని దగ్గర్నుంచి చూశాడు. తమ కమిషన్‌లో భారతీయులెవ్వరినీ చేర్చకపోవటం తప్పని భావించాడు. లండన్‌లో తన చుట్టుపక్కల పేదరికాన్ని చూసి... సామ్యవాద భావాలతో అక్కడి లేబర్‌ పార్టీలో చేరాడు. ఏకాభిప్రాయ సాధనకు పెద్దపీటవేసే ధోరణి.. ఆయన్ను త్వరగా పార్టీలో ఎదిగేలా చేసింది. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధసమయంలో... బ్రిటన్‌ జాతీయ ప్రభుత్వంలో చర్చిల్‌ వద్ద ఉపప్రధాని అయ్యారు అట్లీ! యుద్ధానంతరం ఎన్నికల్లో లేబర్‌పార్టీ నెగ్గటంతో... ప్రధాని పదవి ఆయన్ను వరించింది. క్రికెట్‌ ప్రేమికుడైన అట్లీ... క్రికెట్‌ జట్టులాగే తన కేబినెట్‌ను కూడా ఆల్‌రౌండర్లు, సమర్థ బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌తో కూర్చుకున్నారు. ఎర్నెస్ట్‌ బెవాన్‌కు విదేశాంగ శాఖ ఇచ్చారు. భారత్‌ వ్యవహారాలను మాత్రం మినహాయించారు.

యుద్ధానంతరం ఇంగ్లాండ్‌ పునర్‌ నిర్మాణం అట్లీ ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇందుకు అడ్డు వచ్చే అంశాలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. రాజకీయ కారణాలతో అణు సాంకేతికతను పంచుకోవటానికి అమెరికా నిరాకరించింది. దీంతో బ్రిటన్‌ సొంతంగా అణుబాంబు తయారు చేయాలని అట్లీ నిర్ణయించారు. మధ్యప్రాచ్యంలో కూడా ఇజ్రాయెల్‌ను కట్టడి చేస్తూ... అరబ్‌ దేశాలకు మద్దతిచ్చారు అట్లీ! అదే క్రమంలో... భారత్‌ విషయం కూడా తేల్చేయటానికే సిద్ధమయ్యారు. అప్పటికే తనకు కొంతమేర భారత్‌పై సానుభూతి ఉండటంతో పాటు... ఈ సమస్యను నాన్చితే తన పనికి కూడా అడ్డు తగులుతుందని భావించారు. ఫలితమే భారత్‌కు స్వాతంత్య్ర ప్రక్రియ. 1946లో అధికార బదిలీ సజావుగా సాగేందుకు కేబినెట్‌ బృందాన్ని పంపించారు. అది విఫలమైనా అట్లీ సహనం కోల్పోలేదు. నిరాశ చెందలేదు. సమయం కోసం వేచి చూడసాగారు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతే.. స్వయంప్రతిపత్తి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకుంది ఇంగ్లాండ్‌. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలోనూ... భారత సైనికులను వాడుకొని మొండి చేయి చూపిస్తే ఉద్యమం తీవ్రం అవుతుంది. పైగా... సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ప్రభావం; 1946లో భారత నౌకాదళంలో తలెత్తిన తిరుగుబాటుతో సైన్యం మునుపటిలా లేదు. ఇవన్నీ అట్లీ ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేశాయి. అప్పటి వైస్రాయ్‌ వేవెల్‌ను లండన్‌కు పిలిపించి మాట్లాడారు. అట్లీ ప్రతిపాదన ఇష్టంలేని వేవెల్‌ (చర్చిల్‌ మనిషి) ఆ పని చేస్తే భారత్‌లో అంతర్యుద్ధం వస్తుందని... దాన్ని తట్టుకోవటం బ్రిటన్‌ వల్ల కాదని భయపెట్టారు. వెంటనే... వేవెల్‌ను తప్పించి, లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ను భారత్‌కు వైస్రాయ్‌గా పంపించారు అట్లీ. అంతేగాకుండా... 1948 జూన్‌ 30నాటికి భారత్‌ నుంచి వైదొలగుతామంటూ... అట్లీ స్వయంగా బ్రిటన్‌ పార్లమెంటులో ప్రకటించారు. భారత్‌ను విభజించాలా? ఐక్యంగా ఉంచాలా? ఎవరికి అధికారాన్ని బదిలీ చేయాలి... అనేవి తేలకుండానే అట్లీ ప్రకటన చేయటం విశేషం. అప్పటిదాకా భారత్‌లో మరే వైస్రాయ్‌కీ ఇవ్వని అధికారాలను ఇచ్చి మౌంట్‌బాటెన్‌ను పంపించిన అట్లీ... ఆయనకు సూటిగా సుత్తిలేకుండా... స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘‘వీలైతే భారత్‌ను ఐక్యంగా ఉంచు. లేదంటే... శిథిలాలనుంచి ఏమైనా మిగుల్చు! ఏదేమైనా... బ్రిటన్‌ను మాత్రం అక్కడి నుంచి బయటపడేయ్‌!’’... ఇదే మౌంట్‌బాటెన్‌కు అట్లీ చేసిన సూచన!


1947 మార్చి 22న భారత్‌లో దిగిన మౌంట్‌బాటెన్‌ తమ ప్రధానికంటే వేగంగా కదిలారు. ముస్లింలీగ్‌ను వారడిగిన దానికంటే తక్కువకు ఒప్పిస్తూ... కాంగ్రెస్‌ను విభజనకు అంగీకరింపజేశారు. అంతేగాకుండా... అట్లీ పెట్టిన ముహూర్తాన్ని కూడా ముందుకు జరిపారు. ఇక వెళ్లాలనే నిర్ణయించాక... ఆలస్యమెందుకంటూ... తమ ప్రధాని చెప్పినదానికంటే 11 నెలల ముందే భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించారు. దేశాన్ని విభజించినందుకు అట్లీని విలన్‌ అనాలా... 200 ఏళ్ల వలసపాలన నుంచి విముక్తి కల్పించినందుకు హీరో అనాలా మనమే తేల్చుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని