Bangladesh: చాక్లెట్‌ కోసం సరిహద్దు దాటి భారత్‌లోకి.. చివరకు జైలుపాలు!

భారత్‌లో లభించే చాక్లెట్ల కోసం ఓ బంగ్లాదేశీ టీనేజర్‌ సరిహద్దులు దాటేవాడు. తాజాగా అతడిని భద్రతా దళం పట్టుకోగా.. కోర్టు 15రోజుల కస్టడీ విధించింది.......

Published : 15 Apr 2022 22:54 IST

దిల్లీ: బంగ్లాదేశ్‌లో నివసించే టీనేజర్ ఇమాన్ హుస్సేన్‌కు భారత్‌లో లభించే చాక్లెట్‌లంటే మహా ఇష్టం. భారత్​-బంగ్లాదేశ్​కు సరిహద్దుగా ఉండే షాల్డా నది సమీపంలోని ఓ గ్రామంలో ఉండే ఇమాన్‌.. ఈ చాక్లెట్ల కోసం సాహసం చేస్తూ భారత్‌లోకి చొరబడేవాడు. త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్​చౌరా గ్రామానికి గుట్టుగా వచ్చి వెళుతుండేవాడు. ముందు షాల్డా నదిని ఈది, భారత్​ వైపునకు వచ్చేవాడు. తర్వాత సరిహద్దు కంచెలో ఎక్కడైనా రంధ్రాలు ఉన్నాయేమో చూసుకుని.. భారత్​లోకి అడుగుపెట్టేవాడు. దగ్గర్లోని దుకాణంలో చాక్లెట్లు కొనుక్కుని అదే దారిలో తిరిగి వెళ్లిపోయేవాడు.

ఇమాన్​ హుస్సేన్ ‘చాక్లెట్ యాత్రలు’ ఇప్పటివరకు బాగానే సాగాయి. కానీ ఏప్రిల్ 13న అతడి ‘రాకపోకలు’ సాగలేదు. అక్రమంగా సరిహద్దు దాటుతున్న ఇమాన్​ను బోర్డర్‌ భద్రతా దళం పట్టుకుంది. అనంతరం సోనమురా పోలీసులకు అప్పగించగా వారు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ బంగ్లాదేశీ టీనేజర్‌కు న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ‘బంగ్లాదేశ్‌కు చెందిన బాలుడు చాక్లెట్​ కొనుక్కునేందుకు భారత్​లోకి చొరబడినట్లు విచారణలో అంగీకరించాడు. అతడి వద్ద 100 బంగ్లాదేశీ టాకాలు మాత్రమే ఉన్నాయి. చట్టవిరుద్ధమైన వస్తువులేవీ లేవు. సరైన పత్రాలు లేకుండా భారత్​లోకి ప్రవేశించినందుకే ఇమాన్​ను అరెస్టు చేశాం. విచారణ జరుగుతోంది. రిమాండ్ పూర్తయ్యాక అతడిని మళ్లీ కోర్టులో హాజరుపరచుతాం’ అని సోనమురా పోలీసు అధికారి బనోజ్ బిప్లబ్ దాస్ పేర్కొన్నారు.

ఇమాన్​ కుటుంబసభ్యులెవరూ భారత అధికారుల్ని ఇంకా సంప్రదించలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కిరాణా సామగ్రి కొనుక్కునేందుకు, వివాహాలు వంటి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బంగ్లాదేశీలు ఇలా సరిహద్దు దాటి భారత్​లోకి వస్తుంటారని కలామ్​చౌరా వాసి ఇలియుస్ హుస్సేన్ తెలిపారు. మానవతా కోణంలో బీఎస్​ఎఫ్​ వారిని పెద్దగా పట్టించుకోరని, స్మగ్లర్లపై మాత్రమే చర్యలు తీసుకుంటారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని