West Bengal: సజీవ దహన ఘటనపై కేంద్రం దిగ్భ్రాంతి

పశ్చిమ బెంగాల్‌లో తాజా చెలరేగిన హింసాత్మక ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. బీర్భుమ్‌ జిల్లా రాంపూర్‌హట్‌లో 8 మందిని సజీవ దహనం చేసిన ఘటనపై......

Published : 23 Mar 2022 01:50 IST

దీదీ ప్రభుత్వంపై భాజపా తీవ్ర విమర్శలు.. రాజీనామా చేయాలని డిమాండ్‌

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తాజా చెలరేగిన హింసాత్మక ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. బీర్భుమ్‌ జిల్లా రాంపూర్‌హట్‌లో 8 మందిని సజీవ దహనం చేసిన ఘటనపై కేంద్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనిపై పూర్తి విచారణ చేపట్టేందుకు హోంశాఖ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు భాజపా బెంగాల్‌ చీఫ్‌ సుకాంత మజుందార్‌ వెల్లడించారు.  హోంమంత్రి అమిత్‌షాతో ఈ విషయం చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని మజుందార్‌ డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాలు, బెంగాల్‌లోని శాంతి భద్రతలపై భాజపా బెంగాల్‌ యూనిట్‌ కూడా హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తాజా అల్లర్ల ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్ మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీని ఆదేశించారు. ‘రాంపూర్‌హట్‌లో జరిగిన ఈ భయంకరమైన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలోని శాంతిభద్రతల తీరుకు అద్దంపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హింసా సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా సెక్రెటరీని ఆదేశిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

బెంగాల్‌లో ప్రజాస్వామ్యం మంటగలుస్తోందంటూ రాష్ట్ర భాజపా ప్రతినిధి గౌరవ్‌ భాటియా మండిపడ్డారు. అల్లర్లు సృష్టించి, సజీవ దహనానికి పాల్పడినవారిని రాష్ట్ర ప్రభుత్వం రక్షిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘మమతా బెనర్జీ ప్రభుత్వం నుండి రక్షణ పొందే సంఘవిద్రోహ శక్తులు రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్నాయి. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి, బయట నుండి తాళాలు వేసి, నిప్పు పెడతాయి. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. తాజా మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మంటలను ఆర్పకుండా తమను అడ్డుకున్నారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు’ అంటూ గౌరవ్‌  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ ఘటన..

రాంపూర్‌హట్‌ ప్రాంతంలో.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మనుషుల్ని లోపల పెట్టి, ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. 10-12 నివాసాలకు మంటలు అంటుకున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఇదిలాఉంటే.. సోమవారం రాత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌ పంచాయతీ నాయకుడు భదు ప్రధాన్‌ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున తాజా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా ఈ అల్లర్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని