భారత్‌ బయోటెక్‌కు CISF భద్రత!

హైదరాబాద్‌ శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ కార్యాలయంతో పాటు వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రానికి 64 మందితో కూడిన సాయుధ బలగాలు పహారా కాయనున్నాయి.

Published : 08 Jun 2021 21:35 IST

కేంద్ర హోంశాఖ నిర్ణయం

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో కీలకంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ సంస్థకు కేంద్ర ప్రభుత్వం మరింత భద్రతను పెంచింది. హైదరాబాద్‌లో ఉన్న ప్రాంగణానికి సీఐఎస్‌ఎఫ్‌ కమాండోల భద్రతను కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో హైదరాబాద్‌ శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయంతో పాటు వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రానికి 64 మందితో కూడిన సాయుధ బలగాలు పహారా కాయనున్నాయి.

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సమయంలోనూ దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు ఇక్కడ నుంచి వ్యాక్సిన్‌ ఎగుమతి జరుగుతోంది. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తోన్న సంస్థలకు ఉగ్రవాద ముప్పు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భద్రతను సమీక్షించింది. దేశ వైద్య, ఆరోగ్య భద్రతకు కీలకంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ప్రాంగణానికి అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం 64 మందితో కూడిన సీఐఎస్‌ఎఫ్‌ సాయుధ బలగాలతో రక్షణ కల్పించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. జూన్‌ 14 నుంచి భారత్‌ బయోటెక్‌ కేంద్రం వద్ద బలగాలు విధులు నిర్వర్తిస్తాయని సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ అనిల్‌ పాండే వెల్లడించారు.

2008లో ముంబయి దాడుల అనంతరం దేశవ్యాప్తంగా ముప్పు ఉన్న పలు ప్రైవేటు ప్రదేశాలకు సాయుధ బలగాలతో భద్రతను అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పది ప్రైవేటు సంస్థలకు సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని