Bharat Jodo Yatra: 5 నెలలు.. 4000 కి.మీ.. ముగిసిన రాహుల్‌ యాత్ర..!

భారత్‌ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసింది. సుమారు 5 నెలలపాటు 4వేల కి.మీ మేర ఈ యాత్ర కొనసాగింది. సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. ఈ తరుణంలో జనవరి 30న కశ్మీర్‌లో ముగింపు సభ ఏర్పాటు చేసింది.

Published : 29 Jan 2023 21:47 IST

దిల్లీ: భాజపా విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగిసింది. ‘మిలే కదం.. జుడే వతన్‌ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర దాదాపు 3970 కి.మీ మేర సాగింది.

సుమారు ఐదు నెలలపాటు కొనసాగిన ఈ యాత్ర మధ్యలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. రాహుల్‌ ధరించిన టీ షర్టు మొదలు వీర్‌ సావర్కర్‌, కొవిడ్‌ నిబంధనలు వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ రూ.41వేల విలువచేసే టీ షర్టుపై యాత్ర ఆరంభంలోనే భాజపా తీవ్ర విమర్శలు చేసింది. వీటితోపాటు పంజాబ్‌లో పాదయాత్రలో పాల్గొన్న ఓ కాంగ్రెస్‌ ఎంపీ చనిపోగా.. మహారాష్ట్రలో యాత్ర కొనసాగుతున్న సమయంలో మరో కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం వంటి విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.

ప్రముఖుల మద్దతు..

రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఆయనకు సంఘీభావం తెలుపుతూ యాత్రలో భాగమయ్యారు. దివంగత జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ కుటుంబ సభ్యులు భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటి పూజా భట్‌ రాహుల్‌ వెంట నడిచారు. మహారాష్ట్రలో మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ కూడా పాల్గొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌, నటుడు కమల్‌ హాసన్‌, బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, పరమ్‌ వీరచక్ర గ్రహీత కెప్టెన్‌ బానా సింగ్‌, నటి ఊర్మిళ మతోండ్కర్‌, స్వరా భాస్కర్‌, రియా సేన్‌, ఆదిత్యా ఠాక్రే, సుప్రియా సూలే, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్, పంజాబ్‌లో హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది ప్రముఖులు రాహుల్‌ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఆయన వెంట నడిచారు.

30న ముగింపు సభ..

సుదీర్ఘకాలం పాటు సాగిన భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినట్లు కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. యాత్ర ముగింపు సందర్భంగా కశ్మీర్‌లో సోమవారం (జనవరి 30) బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు 12 విపక్ష పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 21 పార్టీలకు ఆహ్వానం పంపినప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పార్టీలు రావడం లేదని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని