US: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గుడ్‌న్యూస్‌

అగ్రరాజ్యంలోని భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు ప్రయోజనం కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత

Updated : 12 Nov 2021 17:00 IST

‘ఆటోమెటిక్ వర్క్‌ ఆథరైజేషన్‌’ కల్పించిన బైడెన్‌ సర్కారు

వాషింగ్టన్‌: భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు ప్రయోజనం కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ‘ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌’ కింద అనుమతులు ఇచ్చేందుకు బైడెన్‌ సర్కారు అంగీకరించింది. ఈ అంశంపై వలసదారుల జీవిత భాగస్వాముల తరఫున అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) వేసిన పిటిషన్‌పై అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సానుకూలంగా స్పందించింది. 

అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, హెచ్‌-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్‌ పత్రాల పొడగింపు కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ, గతంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించడంతో వారు రీ-ఆథరైజేషన్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఎలాంటి చట్టబద్ధమైన కారణాలు లేకుండా వీరు అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. 

దీనిపై వలసదారుల జీవిత భాగస్వాములు ఏఐఎల్‌ఏను ఆశ్రయించగా.. వారు హోంల్యాండ్‌ సెక్యూరిటీస్‌ విభాగంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా బైడెన్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఇకపై తమ ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ పొడగింపు కోసం ఎదురుచూడకుండా ఆటోమెటిక్‌గా పని అనుమతులు పొందనున్నారు. దీనిపై ఏఐఎల్‌ఏ డైరెక్టర్‌ జెస్సీ బ్లెస్ మాట్లాడుతూ.. ‘‘ఇది సంతోషకరమైన విషయం. హెచ్-4 వీసాదారులకు భారీ ఉపశమనం కలిగిస్తుంది’’ అని అన్నారు. 

ఒబామా హయాంలో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా వెళ్లే వలసదారులకు ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఇప్పటి వరకు 90వేలకు పైగా హెచ్‌-4 వీసాలను జారీ చేయగా.. వీటిలో మెజార్టీ సంఖ్యలో భారతీయ మహిళలే ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని