
పెద్దసారు పెంపుడు కుక్క కరిస్తే..!
* ‘మేజర్’, ‘ఛాంప్’ను డెలావేర్ పంపిన శ్వేతసౌధ సిబ్బంది
ఇంటర్నెట్డెస్క్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్-జిల్ దంపతులకు కొంచెం నిరాశ ఎదురైంది. వారు ప్రేమగా పెంచుకొంటున్న రెండు పెంపుడు శునకాలను శ్వేత సౌధం సిబ్బంది డెలావేర్లోని వెల్మింగ్టన్లో బైడెన్ నివాసానికి తరలించేశారు. బైడెన్ దంపతులు ‘మేజర్’, ‘ఛాంప్’ అనే రెండు జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాలను పెంచుకొంటున్నారు. వీటిల్లో మేజర్ వయస్సు మూడేళ్లు. దీనిని ఓ రెస్క్యూహోం నుంచి 2018లో బైడెన్ దత్తత తీసుకొన్నారు. వాస్తవానికి ఈ శునకాలు బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన వారం తర్వాత శ్వేత సౌధంలోకి ప్రవేశించాయి. కానీ, ఇవి అక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోయాయి. వీటిల్లో చిన్నదైన మేజర్ శ్వేత సౌధం సిబ్బందితో దూకుడుగా ప్రవర్తించేది. ఇటీవల భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేసి గాయపర్చింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి తెలియరాలేదు.
ఈ ఘటనతో గత వారం వాటిని డెలావేర్లోని బైడెన్ కుటుంబం నివసించే వెల్మింగ్టన్కు తరలించారు. ఈ శునకాలు శ్వేతసౌధంలోని ఎలివేటర్లోకి వెళ్లడం, ఎక్కువమంది ఉండే దక్షిణం వైపు లాన్లోకి వెళ్లడం చేస్తుండటంతో జోసతీమణి వీటిని అదుపుచేసే బాధ్యత తీసుకొన్నారు. వాస్తవానికి శ్వేతసౌధంలోని ఫర్నిచర్పైకి శునకాలను రానీయరు. కానీ, తన శునకాలు ఎక్కువసేపు అక్కడి సోఫాలపైనే పరుగులు తీస్తున్నాయని జో ఒక సందర్భంలో తెలిపారు. దీనికి తోడు తాజాగా శ్వేత సౌధ సిబ్బందిపై దాడి చేయడంతో ఇక వాటిని తిరిగి డెలావేర్కు తరలించాల్సి వచ్చింది. దీనిపై శ్వేతసౌధం ఎటువంటి ప్రకటన చేయలేదు.