Anand Mohan: మాజీ ఎంపీ రెమిషన్‌పై రికార్డులివ్వండి.. బిహార్‌కు సుప్రీం ఆదేశాలు

మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ (Anand Mohan)ను బిహార్‌ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నీతీశ్ సర్కారుకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

Published : 19 May 2023 15:18 IST

దిల్లీ:  ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య (G Krishnaiah) హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ (Anand Mohan) మందుస్తు విడుదలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ జరిపింది. ఆయన శిక్షా కాలాన్ని తగ్గించి రెమిషన్‌ (remission) మంజూరు చేయడానికి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులన్నింటినీ కోర్టుకు సమర్పించాలని బిహార్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణలోగా వాటిని న్యాయస్థానం ముందుంచాలని స్పష్టం చేసింది.

ఆనంద్‌ మోహన్‌ (Anand Mohan)కు రెమిషన్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణయ్య భార్య ఉమాదేవి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని ముందస్తుగా విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని బిహార్‌ ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ, ఆనంద్‌ మోహన్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆనంద్‌ మోహన్‌ విడుదల కోసం బిహార్‌ ప్రభుత్వం (Bihar Govt) జైలు నిబంధనలను మార్చేసిందని ఉమాదేవి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. మాజీ ఎంపీ రెమిషన్‌కు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వీటితో పాటు ఆనంద్‌ మోహన్‌ నేరచరిత్రకు సంబంధించిన పత్రాలను కూడా ఇవ్వాలని సూచించింది. అటు ఉమాదేవి పిటిషన్‌కు తమ స్పందన తెలియజేసేందుకు బిహార్‌ ప్రభుత్వానికి మరింత గడువు కల్పించింది. దీనిపై ఆగస్టు 8న తదుపరి విచారణ చేపడుతామని తెలిపిన ధర్మాసనం.. ఆ తర్వాత ఇక వాయిదాలు ఉండబోవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: రూల్స్‌ మార్చి మరీ గ్యాంగ్‌స్టర్‌ విడుదల.. ఎవరీ ఆనంద్‌ మోహన్‌..?

1994లో గోపాల్‌గంజ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌గా తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ అధికారి జి. కృష్ణయ్య పనిచేస్తున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ హింసలో ఆనంద్‌ మోహన్‌ తన అనుచరులతో కలిసి చేసిన మూక దాడిలో కృష్ణయ్య మృతిచెందారు. ఈ కేసులో నేరం నిరూపణ కావడంతో ఆనంద్‌ మోహన్‌కు బిహార్‌ దిగువ కోర్టు మరణ శిక్ష విధించింది. తర్వాత ఈ తీర్పుపై విచారణ చేపట్టిన పట్నా హైకోర్టు ఈ శిక్షను జీవితఖైదుగా మార్చింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడంతో గత 15 ఏళ్లుగా ఆనంద్‌ మోహన్‌  జైలులో శిక్ష అనుభవించారు. అయితే, ఇటీవల ఆయన విడుదల కోసం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం జైలు నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ క్రమంలో ఆనంద్‌తో పాటు మరో 27 మంది ఖైదీలను విడుదల చేస్తూ బిహార్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత నెల 27న ఆనంద్‌ మోహన్‌ జైలు నుంచి విడులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని