
Covid vaccine: ఐదుసార్లు కొవిడ్ టీకా తీసుకున్న వైద్యురాలు..!
పట్నా: ఇటీవల బిహార్కు చెందిన ఓ వృద్ధుడు 11 సార్లు కరోనా టీకా తీసుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అదే తరహా ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. బిహార్ రాష్ట్రానికే చెందిన ఓ వైద్యురాలు ఐదుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు.
కొవిన్ పోర్టల్ వివరాల ప్రకారం.. బిహార్ రాజధాని పట్నాకు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ విభా కుమారీ సింగ్ గతేడాది జనవరి 28న తొలిడోసు తీసుకున్నారు. మార్చి నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈనెల 13న ప్రికాషన్ డోసు కూడా తీసుకున్నారు. కానీ ఆమె గతేడాది ఫిబ్రవరి 6న, జూన్ 17న కూడా టీకాలు తీసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది.
ఈ విషయంపై డాక్టర్ విభా కుమారి స్పందించారు. తాను ఆ రెండు వ్యాక్సిన్లు తీసుకోలేదని.. ఎవరో తన పాన్కార్డు వివరాలను ఉపయోగించి ఇలా చేసి ఉంటారని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తాను 11 సార్లు టీకా తీసుకున్నట్లు బిహార్లోని మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజుల క్రితం ప్రకటించాడు. టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే అన్నిసార్లు వేసుకున్నానని పేర్కొన్నాడు. ఉదకిషన్గంజ్ సబ్ డివిజన్ ఒరాయ్ గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్ మండల్.. గతేడాది ఫిబ్రవరి 13న తొలి డోసు తీసుకున్నాడు. అప్పటి నుంచి డిసెంబరు, 2021 వరకు 11 డోసులు పొందారు. ఏయే తేదీల్లో టీకా తీసుకున్నదీ ఆయన రాసి పెట్టుకోవడం విశేషం. ఈ సంగతి అధికారులకు తెలియడంతో.. స్పందించిన జిల్లా యంత్రాంగం ఆయనపై చర్యలు చేపట్టింది.