Doctors: ఏళ్లపాటు విధులకు డుమ్మా.. వీళ్లేం వైద్యులు బాబోయ్‌!

ఏడాదికి పైబడి విధులకు గైర్హాజరవుతున్న వైద్యులకు (Doctors) బిహార్‌ ప్రభుత్వం (Bihar Govt) నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

Updated : 01 Jun 2023 19:58 IST

పట్నా: వైద్యుల్ని (Doctors) దేవుడితో పోల్చుతారు. ప్రాణాపాయం నుంచి ప్రజల్ని గట్టెక్కించేది వాళ్లే. అలాంటి వైద్యులే బాధ్యతను మరచి ప్రవర్తిస్తున్నారు. ఏళ్లపాటు విధులకు గైర్హాజరవుతూ వైద్యవృత్తికే మచ్చతెస్తున్నారు. విధులకు డుమ్మా కొడుతున్న 62 మంది వైద్యులకు బిహార్‌ ప్రభుత్వం (Bihar Govt) తాజాగా నోటీసులు జారీ చేసింది. వీళ్లంతా కనీసం ఏడాదికి పైబడి విధులకు హాజరుకాని వాళ్లే. 15 రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది.

వైద్యుల పేర్లు, వారు పని చేస్తున్న ఆరోగ్యకేంద్రాలు, ఆస్పత్రుల వివరాలను వైద్యశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. నిర్దేశించిన గడువులోగా సంబంధిత అధికారులకు సరైన వివరణ ఇవ్వకపోతే.. ప్రభుత్వ నోటీసులను ధిక్కరించినట్లుగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పైఅధికారుల అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరైనట్లయితే.. సర్వీసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నోటీసులు జారీచేసిన వారిలో అత్యధికంగా 14 మంది రాజధాని పట్నాలోనే విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

విధులకు గైర్హాజరయ్యారన్న కారణంతో గత జనవరిలో బిహార్‌ ప్రభుత్వం 64 మంది వైద్యులను విధుల నుంచి తొలగించింది. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలోని మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు గైర్హాజరుకు గల కారణాలను వివరించాలంటూ ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. అయితే, వైద్యుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రభుత్వం వారందరినీ డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని