World Record: పళ్లతో 165 కిలోల బరువు ఎత్తిన బిహార్‌ వాసి!

హ్యామర్​ హెడ్​మాన్​ ఆఫ్ ఇండియాగా పేరొందిన ధర్మేంద్ర కుమార్‌ తాజాగా మరో రికార్డ్‌ను సాధించారు. తన పళ్లతో ఏకంగా 165 కిలోల బరువును పది సెకన్లపాటు ఎత్తి పట్టుకుని నేతాజీ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించారు.

Updated : 24 Mar 2023 15:22 IST

కైమూర్‌: బిహార్‌(Bihar)లోని కైమూర్‌(Kaimur) జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్‌ సరికొత్త రికార్డ్‌ను నమోదు చేశారు. 165 కిలోల బరువును తన పళ్లతో ఎత్తారు. అలా పది సెకన్లపాటు 165 కిలోల బరువును పళ్లతో పైకిలేపి ప్రపంచ రికార్డును నమోదు చేశారు. త్రిపుర (Tripura)లోని అగర్తలా (Agartala)కు చెందిన నేతాజీ వరల్డ్‌ రికార్డ్‌ ఫౌండేషన్‌ (Netaji World Record Foundation) నిర్వహించిన పోటీల్లో ఈ అరుదైన రికార్డ్‌ను ధర్మేంద్ర కుమార్‌ సొంతం చేసుకున్నారు.

ధర్మేంద్ర ఇప్పటివరకు 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ‘హ్యామర్​ హెడ్​మాన్​ ఆఫ్ ఇండియా’గా ఈయన పేరుపొందారు. గతేడాది  డిసెంబరులో అగర్తలలో జరిగిన పోటీల్లో 122 కిలోల బైక్ ను భుజంపై మోస్తూ.. 30 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తిన వ్యక్తిగా ధర్మేంద్ర రికార్డు సృష్టించారు. అంతకుముందు తలతో కొబ్బరికాయలు పగలకొట్టడం, పళ్లతో ఇనుమును వంచడం లాంటి అరుదైన రికార్డులు ధర్మేంద్ర పేరిట ఉన్నాయి. బెంగాల్​ నుంచి వచ్చిన కొందరు పళ్లతో 165 కిలోల బరువు ఎత్తాలని తనకు సవాల్‌ విసరడంతో ఈ ఫీట్‌ చేసినట్లు ధర్మేంద్ర తెలిపారు. ప్రస్తుతం ధర్మేంద్ర త్రిపుర రైఫిల్స్​ విభాగంలో జవాన్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని