
Covid vaccine: 11సార్లు కొవిడ్ టీకా వేసుకున్న వ్యక్తిపై చీటింగ్ కేసు
దిల్లీ: కొవిడ్ టీకా రెండు డోసులు మాత్రమే వేసుకోవాలని ప్రభుత్వ నిబంధన. అదీ నిర్ణీత గడువు తర్వాతే. ప్రికాషనరీ డోసుకు కేంద్రం ఈమధ్యే అనుమతిచ్చింది. అలాంటిది ఓ వ్యక్తి తాను 11 సార్లు టీకా తీసుకున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బిహార్లోని మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్ తాను ఇప్పటివరకు 11 సార్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా వైద్యాధికారి డా.వినయ్ కృష్ణ ఫిర్యాదు మేరకు 188, 419, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు బ్రహ్మదేవ్ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
కొవిడ్ టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెప్పడం వల్లే అన్నిసార్లు వేసుకున్నానని బ్రహ్మదేవ్ మండల్ కొద్దిరోజుల క్రితం వెల్లడించారు. జిల్లాలోని ఉదకిషన్గంజ్ సబ్ డివిజన్ ఒరాయ్ గ్రామానికి చెందిన ఈ వృద్ధుడు.. 12వ డోసు తీసుకునేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లానని తెలిపారు. అయితే అక్కడ టీకాల కార్యక్రమం ముగియడంతో 12వ డోసు పొందలేకపోయానని విచారం వ్యక్తం చేయడం గమనార్హం. పోస్టల్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన తొలి డోసు 13 ఫిబ్రవరి, 2021న తీసుకున్నారు. అప్పటి నుంచి డిసెంబరు, 2021 వరకు 11 డోసులు పొందారు. ఏయే తేదీల్లో టీకా తీసుకున్నదీ ఆయన రాసి పెట్టుకోవడం విశేషం. ఈ సంగతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. తాజాగా అతడిపై చర్యలకు ఉపక్రమించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.