కొవిడ్‌ తదనంతర సమస్యలతో మంత్రి మృతి!

కొవిడ్‌-19 తదనంతర సమస్యలతో బాధపడుతూ బిహార్‌ బీసీశాఖ మంత్రి వినోద్‌ కుమార్‌ సింగ్‌ మరణించారు. ఇటీవల మెదడు సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వినోద్‌.. చికిత్స పొందుతూ సోమవారం మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు.

Published : 12 Oct 2020 19:47 IST

పట్నా: కొవిడ్‌-19 తదనంతర సమస్యలతో బాధపడుతూ బిహార్‌ బీసీశాఖ మంత్రి వినోద్‌ కుమార్‌ సింగ్‌ మరణించారు. ఇటీవల మెదడు సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వినోద్‌.. చికిత్స పొందుతూ సోమవారం మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. వారు తెలిపిన ప్రకారం.. గత జూన్‌ 28న వినోద్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొద్ది రోజులకు ఆయనకు మెదడులో రక్త స్రావం సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వినోద్‌ కుమార్‌ కతిహార్‌ జిల్లాలోని ప్రాన్పూర్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనకు భార్య నిషా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

కాగా ఆయన మృతిపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. ‘వినోద్‌ కుమార్‌ సమర్థవంతమైన నాయకుడు. ఆయన మరణించడం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధిస్తోంది. వినోద్‌ మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన అంత్యక్రియల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది’ అని ప్రకటించారు. కాగా భాజపా వినోద్‌ భార్య నిషాసింగ్‌ను ప్రాన్పూర్‌ తరపున బరిలో దింపాలని యోచిస్తోంది. ప్రాన్పూర్‌కు మూడో విడతలో నవంబర్‌ 7న ఎన్నిక జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని