బీమా సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బీమా సవరణ బిల్లు-2021కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం.

Published : 22 Mar 2021 17:38 IST

దిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బీమా సవరణ బిల్లు-2021కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. దీని వల్ల బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అదనపు నగదు సమీకరించేందుకు వీలు పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వారం క్రితం రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది.

బిల్లుపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ బీమా సంస్థలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, అదే ప్రైవేటు కంపెనీలైతే సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీమా సంస్థలు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొవిడ్‌ మహమ్మారి సైతం బీమా కంపెనీలను కష్టాల్లోకి నెట్టిందన్నారు. వివిధ వర్గాలతో బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) చర్చించిన అనంతరం చేసిన సిఫార్సుల ఆధారంగానే ఎఫ్‌డీఐ పరిమితిని పెంచినట్లు వివరించారు. 2015లో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం వల్ల రూ.26వేల కోట్లు సమకూరాయని, దీంతో గడిచిన ఐదేళ్లలో ఆ రంగం 76 శాతం వృద్ధి సాధించిందని ఈ సందర్భంగా సీతారామన్‌ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని