Bharat Ratna : ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలి.. భాజపా ఎంపీ డిమాండ్‌

దేశంలోని అన్ని  వర్గాల ప్రజల కోసం పనిచేస్తోన్న ప్రధాని మోదీకి భారత రత్న పురస్కారం ఇవ్వాలని భాజపా ఎంపీ ఒకరు డిమాండ్‌ చేశారు.

Published : 09 Feb 2023 22:30 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి(PM Modi) దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న(Bharat Ratna) ఇవ్వాలని భాజపా ఎంపీ జీఎస్‌ దామోర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్రం ముందు ఈ డిమాండ్‌ను ఉంచారు. ప్రధాని మోదీ సమాజంలోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం చేస్తున్నారన్నారు. అందువల్ల ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్నారు. జీఎస్‌ దామోర్‌ మధ్యప్రదేశ్‌లోని రాట్లాం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 48మంది విశిష్ట వ్యక్తులకు భారతరత్న పురస్కారాలు ప్రదానం చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, బడ్జెట్‌పై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ సభ్యుడు జీఎస్‌ ఔజ్లా మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నాయే తప్ప దూషించడం లేదన్నారు. ఒక దేశ ప్రధానిగా ఆయన విపక్షాల విమర్శలను వినాలని.. ఆయన్ను ఈ దేశంలో ఎవరూ దూషించడం లేదన్నారు. మరోవైపు, ఏఐఎంఐఎం ఎంపీ ఎస్‌ ఐ జలీల్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో మైనార్టీలకు కోత విధించిందని విమర్శించారు. అలాగే, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వేతన జీవులకు భారం కానుందని ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని