Pritam Munde: బ్రిజ్‌భూషణ్‌పై చర్యలుంటాయని భావిస్తున్నా: ప్రీతమ్‌ ముండే

రెజ్లర్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు మహారాష్ట్ర భాజపా ఎంపీ ప్రీతమ్‌ ముండే అన్నారు. ఏ మహిళ ఫిర్యాదు చేసినా.. తొలుత దానిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 15:57 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan Sharan Singh) అంశంపై భాజపా నేతలు స్పందించడం లేదని, అతడిపై చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాడుతోందటూ విమర్శలు వస్తున్న తరుణంలో మహారాష్ట్ర భాజపా ఎంపీ ప్రీతమ్‌ ముండే స్పందించారు. రెజ్లర్ల ఫిర్యాదును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్నారు. తాను ఓ భాజపా ఎంపీగా ఈ మాట చెప్పడం లేదని, సాటి మహిళగా చెబుతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. రెజ్లర్లు మాత్రమే కాదు.. ఏ మహిళ ఫిర్యాదు చేసినా.. తొలుత దానిని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపట్టి.. వాళ్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందో లేదో? తెలుసుకోవాలని అన్నారు. రెజ్లర్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు మహారాష్ట్రలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రీతమ్‌ ముండే అన్నారు.

భారత రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తు విషయంలో యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (UWW) కూడా అసహనం వ్యక్తం చేసినట్లు ఈ సందర్భంగా ముండే గుర్తు చేశారు. 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించకపోతే భారత రెజ్లింగ్‌ సమాఖ్య గుర్తింపును రద్దు చేస్తామని UWW ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో రెజ్లర్ల ఆందోళన అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయిందని, ఈ సమయంలో విచారణ కమిటీ వేస్తే అది కేవలం ప్రచారం కోసమే చేసినట్లవుతుందని ముండే అభిప్రాయపడ్డారు. రెజ్లర్లతో సరైన పద్ధతిలో కేంద్రం సంప్రదింపులు జరపలేదని ఆమె అన్నారు. తాను కూడా ప్రభుత్వంలో భాగమైనప్పటికీ దీనిని అంగీకరించాల్సిందేనన్నారు. ‘‘భాజపాకి దేశమే ప్రథమం. ఆ తర్వాతే పార్టీ. వ్యక్తిగతానికి చివరి ప్రాధాన్యత. కానీ, ప్రభుత్వంలో అయినా, పార్టీలోనైనా ఒక వ్యక్తి ఆలోచనలు చాలా కీలకం. ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగుతుంటే గుర్తించకపోవడం సరికాదని నేను భావిస్తున్నాను’’ అని ప్రీతమ్‌ ముండే వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని