Sethusamudram: ‘సేతు సముద్రం’ నిర్మాణానికి అడుగులు పడేనా?

భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు ప్రాంతంలో సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీర్మానించింది. దీనికి ప్రతిపక్ష భాజపా కూడా మద్దతు తెలిపింది. దీంతో వందల ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి ఆశలు చిగురించాయి.

Updated : 12 Jan 2023 18:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘంగా నిర్మాణానికి నోచుకోని ‘సేతు సముద్రం’ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. చాలా కాలంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న భాజపా.. తాజాగా అధికార డిఎంకేకు మద్దతు పలికింది. అయితే, రామసేతుకు నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని షరతు విధించింది. సేతు సముద్ర నిర్మాణం చేపట్టాలంటూ పార్టీలకు అతీతంగా తమిళనాడు అసెంబ్లీ గురువారం తీర్మానించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రతిపక్ష భాజపాతోపాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ‘‘ సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణంలో కొనసాగుతున్న జాప్యం తమిళనాడు అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి అవరోధంగా మారుతోంది. అందువల్ల నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను కొసాగించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది. భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు ఉందని చెప్పడం కష్టమంటూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానం తీసుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసలేంటీ సేతు సముద్రం?

భారత్‌, శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో సేతుసముద్ర ప్రాజెక్టును నిర్మించాల్సివుంటుంది. భారత్‌దేశం తూర్పు, పశ్చిమ తీరాల మధ్య ప్రయాణించాలంటే ప్రస్తుతం శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అలా కాకుండా  నౌకలు ప్రయాణించేందుకు వీలుగా చిన్నపాటి మార్పులు చేసినట్లయితే.. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా కేవలం భారత్‌ జలాల ద్వారానే రవాణా చేసుకునే వీలుంటుంది. ఆర్థికంగా అటు తమిళనాడుకు, భారత్‌కు కూ డా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, నౌకల రవాణాకు అనుకూలంగా మార్చాలంటే పురాతన రామసేతు మార్గంలో కొంతభాగాన్ని తవ్వాల్సి వస్తోంది. ఇది ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిబంధకంగా మారింది.గతంలో చాలా సార్లు ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడినా..మత పరంగా సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గిపోయాయి.

1860లోనే అడుగులు..

సేతు సముద్రం ప్రాజెక్టు చేపట్టాలని 1860లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది.  తద్వారా భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలను అనుసంధానం చేయాలని సంకల్పించింది. అయితే, రామసేతు హిందువులకు సంబంధించిన స్థలమని, దానిని కూల్చడానికి వీల్లేదంటూ కొన్ని మత సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

డీఎంకే కలల ప్రాజెక్టు..

సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని డీఎంకే పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై, ఆ తర్వాత కరుణానిధి, తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలంటూ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో మరోసారి తమిళనాడు ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది. ఆ తర్వాత మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూ.2,400 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే హిందుత్వ సంఘాలు, పర్యావరణ వేత్తలు అడ్డుకోవడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాల్సిందిగా 2007లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

చిగురించిన ఆశలు

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలిపోతుందనుకుంటున్న తరుణంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యలతో మళ్లీ ఆశలు చిగురించాయి. స్పేస్‌ టెక్నాలజీ ద్వారా సేతుసముద్రం ప్రాంతంలో కొన్ని ద్వీపాలు, సున్నపురాయి వంటివి కనిపించాయని, అయితే, వాటి ఆధారంగా అక్కడ రామసేతు నిర్మాణం జరిగిందని చెప్పడం కష్టమేనని పార్లమెంట్‌లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి భాజపా కూడా మద్దతివ్వడం..ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయనడానికి ఊతమిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని