Black Fungus: మహారాష్ట్రలో 2వేల కేసులు!

మహారాష్ట్రలో దాదాపు 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 12 May 2021 14:26 IST

ప్రత్యేక కేంద్రాల్లో చికిత్సకు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాట్లు

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కరోనా బాధితులను బ్లాక్‌ఫంగస్‌ వేధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్రలోనూ దాదాపు 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ముందుజాగ్రత్తగా అక్కడి మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

‘ఇప్పటివరకు రాష్ట్రంలో 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ బాధితులు ఉండవచ్చు. కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తాం’ అని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే పేర్కొన్నారు. ఈ బాధితులకు పలు విభాగాల చికిత్స అవసరం అవుతున్నందున ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

మ్యూకోర్‌మైకోసిస్‌ బాధితులకు ఈఎన్‌టీ, కంటి చూపు, న్యూరో వైద్యుల సహాయం అవసరమవుతుందని రాజేష్‌ తోపే పేర్కొన్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వ పథకం మహాత్మ పూలే జన్‌ ఆరోగ్య యోజన కింద చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ చికిత్సకు వినియోగించే ఔషధాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. అందుచేత వీటి ధర తగ్గించాలని కోరుతూ జాతీయ ఫార్మా ధరల సంస్థకు లేఖ రాస్తున్నట్లు మంత్రి చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌ బాధితుల చికిత్సకు ఆంఫోటెర్సిన్‌-బీ ఇంజక్షన్‌ అవసరం అవుతున్నందున ముందుజాగ్రత్త చర్యగా ఓ లక్ష ఇంజక్షన్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

మరణాల రేటు 50శాతం..

‘మ్యూకోర్‌మైకోసిస్‌’గా పిలిచే ఈ వ్యాధి తాజాగా కరోనా రోగులపై ప్రభావం చూపుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. తలనొప్పి, జ్వరం, కళ్లకింద నొప్పి, సైనస్‌ లేదా శ్వాసమార్గం మూసుకుపోయినట్లు కావడం, పాక్షికంగా కంటిచూపు కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇతర ఆరోగ్యసమస్యలు, రోగనిరోధకత క్షీణించిన రోగులపై బ్లాక్‌ ఫంగస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో కరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో మరణాల రేటు 50శాతం ఉండడం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఇప్పటికే దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో వెలుగుచూశాయి.

ఇదిలాఉంటే, మ్యూకోర్‌మైకోసిస్‌పై అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పలు సూచనలు చేసింది. ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని పేర్కొంది. కానీ, దీనిని ముందుగానే గుర్తించి యాంటీఫంగల్‌ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని