Covid: రూల్స్‌ బ్రేక్‌.. బ్రెజిల్‌ అధ్యక్షుడిపై కేసు

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో కొవిడ్‌ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది.

Updated : 23 May 2021 18:57 IST

చట్టం ముందు అందరూ సమానమేన్న రాష్ట్ర గవర్నర్‌

సావో లూయిస్‌: కరోనా వైరస్‌ ధాటికి బ్రెజిల్‌ కూడా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వైరస్‌ కట్టడిలో అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు కొవిడ్‌ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది.

బ్రెజిల్‌లోని మారన్‌హవో రాష్ట్రంలో కొవిడ్‌ కట్టడి ఆంక్షల్లో భాగంగా వందమందికిపైగా పాల్గొనే సమావేశాలపై నిషేధం ఉంది. అంతేకాకుండా మాస్కు ధరించని వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్‌హవో రాజధాని సావో లూయిస్‌ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో మాస్కు కూడా ధరించలేదు. అంతేకాకుండా కొవిడ్‌ ఆంక్షలను అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేతను ‘చబ్బీ డిక్టేటర్‌’ అంటూ సంబోధించారు.

దీనిపై మారన్‌హవో రాష్ట్ర గవర్నర్‌ ఫ్లావియో డైనో స్పందించారు. స్థానికంగా ఉన్న కొవిడ్‌ ఆంక్షలను ఉల్లంఘించినందున అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని స్పష్టంచేశారు. అయితే, అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం జరిమానా విధించే అవకాశాలున్నాయి.

ఆది నుంచీ అదే తీరు..

ప్రపంచంలో కొవిడ్‌ మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న దేశాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికంగా దాదాపు ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా బ్రెజిల్‌లో 4.5 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో మొదటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు మాస్కులు ధరించడాన్ని వ్యతిరేకిస్తూనే.. ప్రజలు సమూహాలుగా ఏర్పడవచ్చని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకురావడంపైనా తాత్సారం చేస్తున్న బోల్సోనారో.. కేవలం హెర్డ్‌ ఇమ్యూనిటీ ద్వారానే మహమ్మారిని అధిగమించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడి తీరు ఇలా ఉన్నప్పటికీ బ్రెజిల్‌లో పలు రాష్ట్రాలు మాత్రం కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని