Bridge collapse: రూ.13 కోట్లతో కట్టిన వంతెన.. ప్రారంభించకుండానే కూలింది!

గడంక్‌ నదిపై నిర్మించిన వంతెన ఇంకా ప్రారంభించకుండానే కుప్పకూలడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. బిహార్‌లోని బెగూసరయిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 18 Dec 2022 19:40 IST

పట్నా: బిహార్‌(Bihar)లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది! గండక్‌ నదిపై రూ.13.43 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన(Bridge) ఇంకా ప్రారంభించకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణ పనులు 2017లోనే పూర్తయినప్పటికీ అప్రోచ్‌ రోడ్డు లేకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ వంతెన కుప్పకూలడం(Bridge collapse) అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చీఫ్‌మినిస్టర్‌ నాబార్డ్‌(NABARD) పథకం కింద ఈ వంతెన నిర్మాణ పనులు 2016లో ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేశారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి వంతెన నిర్మాణం చేపట్టినా వినియోగంలో లేకపోవడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల క్రితమే 2, 3వ నంబర్ల స్తంభాల వద్ద పగుళ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు దీనిపై ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్టు సమాచారం. ఇంతలోనే ఈ వంతెన ముందు భాగం నదిలో కుప్పకూలిపోయింది. సాహెబ్‌పూర్‌ కమల్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతం పరిధిలోని ఆకృతి టోలచౌకి, బిషన్‌పూర్‌ నుంచి అహోక్‌ గండక్‌ ఘాట్‌ వైపు ఈ వంతెన నిర్మించారు. 

ఈ ఘటనపై లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌ పాసవాన్‌) నేత సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వంతెన నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. అనేకమంది అధికారులు కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు తీసుకొని నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడ్డారని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని