Bullet Train: భారత్‌లో బుల్లెట్‌ రైలు ఎప్పుడొస్తుంది..? మరింత ఆలస్యమేనా..?

ముంబయి-అహ్మదాబాద్‌ నగరాల మధ్య చేపట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 06 Jul 2022 01:57 IST

దిల్లీ: దేశంలో ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేందుకు గానూ హైస్పీడ్‌ రైలు (Highspeed Rail) మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబయి-అహ్మదాబాద్‌ నగరాల మధ్య బుల్లెట్‌ రైలు (Bullet Train) ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ పలు సవాళ్లు ఎదురవుతుండడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ప్రభావం, మహారాష్ట్రలో భూసేకరణలో ఆలస్యంపై అంచనాలు వేసిన తర్వాతే తదుపరి గడువును నిర్దేశిస్తామని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది.

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఎప్పటివరకు పూర్తవుతుందని ప్రశ్నిస్తూ ఠాణెకు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL)కు ఆర్టీఐ (RTI) కింద దరఖాస్తు చేశాడు. ఇందుకు హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ తాజాగా సమాధానమిచ్చింది. ‘మొత్తం రూ.లక్షా 10వేల కోట్లతో చేపడుతోన్న ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.26,872కోట్లు ఖర్చుచేశాం. 297 గ్రామాల్లో సర్వే (JMS) పూర్తయ్యింది. 1396 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇప్పటికే 1248 హెక్టార్లను సేకరించాం. వన్యప్రాణుల సంరక్షణ, అటవీశాఖతోపాటు ఇతర అనుమతులు కూడా వచ్చాయి. అయితే, కొవిడ్‌ ప్రభావం, లాక్‌డౌన్‌, మహారాష్ట్రలో భూసేకరణకు ఎదురవుతోన్న ఇబ్బందులపై అంచనాలు వేసిన తర్వాతే తుది గడువు నిర్దేశిస్తాం’ అని హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

ఇదిలాఉంటే, ముంబయి నుంచి అహ్మదాబాద్‌ మధ్య చేపడుతోన్న ఈ రైలు కారిడార్‌ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అహ్మదాబాద్‌ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. జపాన్‌ సహకారంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. అయితే, మహారాష్ట్రలో ఐదు గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా.. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని