Odisha Train Accident: రైలు దుర్ఘటనలో క్షతగాత్రులను తరలిస్తున్న బస్సుకు ప్రమాదం!

ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం బస్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Published : 04 Jun 2023 20:41 IST

మేదినాపూర్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. గాయాలతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్తుండగా ఆ బస్సు సైతం ప్రమాదానికి గురికావడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి బాలేశ్వర్‌లో రైలు దుర్ఘటనలో గాయపడిన వారిని పశ్చిమబెంగాల్‌లోని మేదినాపూర్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. బస్సు, పికప్‌ వ్యాన్‌ ఎదురెదురుగా పరస్పరం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో బస్సులో ఉన్నవారిలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. అలాగే, ఈ ప్రమాదంతో మేదినాపూర్‌ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. బస్సులో ఉన్న క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా.. పికప్‌ వ్యాన్‌ పూర్తిగా దెబ్బతింది. బస్సు డ్రైవర్‌, వ్యాన్‌ డ్రైవర్లు సైతం గాయపడటంతో వారిని చికిత్సకోసం తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు