గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు ₹లక్ష కోట్లు.. కేబినెట్‌ ఆమోదం

grain storage capacity: గిడ్డంగుల సామర్థ్యం పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లక్ష కోట్లు కేటాయించింది.

Updated : 31 May 2023 16:27 IST

దిల్లీ: గిడ్డంగుల ఏర్పాటు విషయంలో కేంద్ర కేబినెట్‌ (Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కోసం గిడ్డంగుల సామర్థ్యాన్ని (grain storage capacity) పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 700 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పథకం కింద రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ (PM modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

దేశంలో ప్రస్తుతం గిడ్డంగుల సామర్థ్యం 1450 లక్షల టన్నులుగా ఉందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సహకార రంగంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో 2 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆహార పదార్థాల వృథాను తగ్గించేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. గిడ్డంగుల సదుపాయం లేక ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయన్నారు. ఈ గోదాముల ఏర్పాటు ద్వారా నష్టానికి తమ ఉత్పత్తులను రైతులు విక్రయించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. దిగుమతులు తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపారు. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆహార భద్రతకు ఢోకా ఉండదని చెప్పారు. దేశంలో ఏటా 3100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండుతుండగా.. కేవలం 47 శాతం ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు