Arvind Kejriwal: దిల్లీ ‘ఆర్డినెన్స్‌’పై పోరాటం..! మద్దతు పలికిన స్టాలిన్‌

దిల్లీలో పాలనాధికారాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతోన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. నేడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్టాలిన్‌ తెలిపారు.

Published : 01 Jun 2023 18:38 IST

చెన్నై: దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ (Ordinance)పై స్థానిక సీఎం, ఆప్‌ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తన పోరును ముమ్మరం చేశారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతోన్న కేజ్రీవాల్‌.. తాజాగా తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను కలిశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో కలిసి చెన్నై వచ్చిన కేజ్రీవాల్‌.. స్టాలిన్‌తో సమావేశమయ్యారు.

అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘దిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై చర్చించాం. కేంద్ర నిర్ణయం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. దిల్లీ ప్రజలకు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి డీఎంకే అండగా ఉంటుందని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ‘మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఉపయోగించి దిల్లీ, ఆప్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ఒకవేళ భాజపాయేతర పక్షాలన్నీ ఏకమైతే.. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించవచ్చని కేజ్రీవాల్‌ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేజ్రీవాల్‌ ఇప్పటికే బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తదితర నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను కలవనున్నట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు