Mehul Choksi: మెహుల్‌ ఛోక్సీ రెడ్‌కార్నర్‌ నోటీసు రద్దుపై సీబీఐ అప్పీల్‌..

పీఎన్‌బీ కుంభకోణం నిందితుడు మెహుల్‌ ఛోక్సీ (Mehul Choksi)పై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసును ఎత్తివేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సీబీఐ చర్యలకు ఉపక్రమించింది.

Published : 21 Mar 2023 21:43 IST

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13వేల కోట్ల మేర మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన మెహుల్‌ ఛోక్సీ (Mehul Choksi)పై జారీ చేసిన రెడ్‌ కార్నర్‌ నోటీసులను (Red Corner Notice) ఉపసంహరించడంపై సీబీఐ (CBI) స్పందించింది. ఆ నోటీసును పునరుద్ధరించాలని కమిషనల్‌ ఫర్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇంటర్‌పోల్‌ ఫైల్స్‌ (సీసీఎఫ్‌)ను అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

పీఎన్‌బీ కుంభకోణం (PNB Scam) వెలుగులోకి వచ్చిన తర్వాత సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ ED) అభ్యర్థన మేరకు 2018లో ఇంటర్‌పోల్‌ (Interpol).. ఛోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. దీనిపై 2020లో ఛోక్సీ అప్పీల్‌ చేసుకున్నప్పటీకీ ఇంటర్‌పోల్‌ ఆ నిర్ణయాన్ని మార్చలేదు. అయితే, ఆ మరుసటి ఏడాది ఆంటిగ్వాలో ఛోక్సీ ‘కిడ్నాప్‌’ వ్యవహారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 2022లో ఆయన.. సీసీఎఫ్‌ను ఆశ్రయించాడు.

ఈ విభాగం ఇంటర్‌పోల్‌కు చెందినదే అయినా.. ఇంటర్‌పోల్‌ సెక్రటేరియట్‌ నియంత్రణలో ఉండదు. పలు దేశాల నుంచి ఎన్నికైన న్యాయవాదులు ఇందులో పనిచేస్తారు. ఛోక్సీ అప్పీల్‌ను పరిశీలించిన సీసీఎఫ్‌ ఐదుగురు సభ్యుల ఛాంబర్‌.. రెడ్‌ కార్నర్‌ నోటీసులను (Red Notice) ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఛోక్సీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేందుకు అవకాశం లభించింది.

కాగా.. ఈ నిర్ణయంపై భారత సీబీఐ తాజాగా స్పందించింది. ‘‘కేవలం ఊహాత్మక అభిప్రాయాలు, నిరూపణ లేని ఆధారాలతో సీసీఎఫ్‌ (CCF) ఛాంబర్‌.. ఛోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు ఎత్తివేసింది. అయితే ఈ నిర్ణయంతో భారత్‌లోని నేరాలకు ఛోక్సీ నిరపరాధి అని తాము చెప్పడం లేదని సీసీఎఫ్‌.. సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) తదుపరి చర్యలు చేపట్టింది. లోపాలతో కూడిన ఈ నిర్ణయాన్ని సరిదిద్దడంతో పాటు రెడ్‌ కార్నర్‌ నోటీసును పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సీబీఐ పరిశీలిస్తోంది’’ అని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి 10 నెలల ముందే ఛోక్సీ దేశం విడిచి పారిపోయాడు. 2017లోనే ఛోక్సీ ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకుని 2018 నుంచి ఆ దేశంలోనే ఉంటున్నాడు. ఛోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్‌.. ఆంటిగ్వాను కోరినప్పటికీ అందుకు ఆ దేశం ఒప్పుకోలేదు. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని