Bipin Rawat: రావత్‌ మంచినీళ్లు కావాలని అడిగారు: ప్రత్యక్ష సాక్షి 

హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను

Updated : 10 Dec 2021 12:36 IST

కున్నూరు: హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను మంచినీళ్లు కావాలని అడిగారని, అయితే ఆయనే రావత్‌ అనే విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. 

తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్‌ కూలిన ఘటన, ఆ తర్వాత నెలకొన్న భీతావహ పరిస్థితులను కొందరు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘మధ్యాహ్నం సమయంలో మేం పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో భారీ శబ్దం వినిపించింది. అక్కడకు వెళ్లి చూస్తే ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కన్పించింది. దట్టమైన పొగ రావడంతో ముందు మాకెవరూ కన్పించలేదు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్నారు. మేం వారి దగ్గరకు వెళ్లాం. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను మంచినీళ్లు కావాలని అడిగారు. మేం ఆయనను బెడ్‌షీట్‌ సాయంతో బయటకు లాగాం. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయనను తీసుకెళ్లారు. నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్‌ జనరల్‌ రావత్‌ అని నాకు తర్వాత కొందరు వ్యక్తులు చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అప్పుడే తెలిసింది. ఈ దేశం కోసం ఎంతగానో సేవ చేసిన వ్యక్తికి నేను మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయా’’ అని ప్రత్యక్ష సాక్షి కన్నీటి పర్యంతమయ్యారు. 

రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే సరికి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు సీనియర్ ఫైర్‌మ్యాన్‌ ఒకరు తెలిపారు. అందులో ఒకరు సీడీఎస్‌ రావత్‌ అని అన్నారు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రక్షణశాఖ సిబ్బందికి లోగొంతుకతో తన పేరును హిందీలో చెప్పారని తెలిపారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మరణించారని అన్నారు. గాయపడిన మరో వ్యక్తి గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్ అని గుర్తించేందుకు చాలా సమయం పట్టిందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని