
Central Cabinet: 5 రాష్ట్రాల్లో మొబైల్ టవర్ల అనుసంధానం.. 9 రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణం
దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో టెలికాం రంగం, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఐదు రాష్ట్రాల్లోని 7వేలకుపైగా గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేలా టవర్లను అనుసంధానం చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో 44 జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ నెట్వర్క్ను అందించబోతున్నామని, ఇందుకోసం రూ. 6,466 కోట్లతో టవర్లను అనుసంధానం చేయనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీని ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు స్వావలంబన చేకూరుతుందని, విద్యాభ్యాసం, నైపుణ్యాభివృద్ధి, జ్ఞానం పెంపొందించుకునే అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్ట్కు యునివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్వోఎఫ్) నిధులు సమకూర్చనుంది. బిడ్డింగ్ ద్వారా ఈ ప్రాజెక్టును అర్హత ఉన్న కంపెనీలకు అప్పగించనున్నారు. మొదలుపెట్టిన 18 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.
ఆ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కొనసాగింపు..
ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకాల కింద గ్రామీణ ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న రోడ్లు, వంతెనలను పూర్తి చేసేందుకు గడువును పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది. 2024-25నాటికి నిర్మాణాలు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.33,822 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మొత్తంలో కేంద్రం రూ.22,978కోట్లు కేటాయించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.