Corona: నాలుగో వేవ్‌ భయం.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

గత కొద్ది వారాలుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విజృంభిస్తున్నట్లు కన్పిస్తోంది. చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు

Published : 19 Mar 2022 01:29 IST

దిల్లీ: గత కొద్ది వారాలుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విజృంభిస్తున్నట్లు కన్పిస్తోంది. చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

‘‘కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టే ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, కొవిడ్‌ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెంచాలి. కొత్త కేసుల క్లస్టర్లపై నిఘా పెట్టాలి. బహిరంగ ప్రదేశాలు, సామూహిక కార్యక్రమాల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలపై అవగాహన పెంచాలి’’ అని ఆరోగ్యశాఖ లేఖలో పేర్కొంది. పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మార్చి 16న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు రాజేశ్‌ భూషణ్‌ లేఖలో పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు. 

కరోనాపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ముఖ్యంగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని, ప్రజలు నిబంధనలు పాటించాలని కోరింది.

ఇదిలా ఉండగా.. మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్య 3వేలకు దిగువనే ఉంది. అయితే , మరణాలు మాత్రం కాస్త పెరిగాయి. 24 గంటల్లో దేశంలో 2,538 కేసులు నమోదవ్వగా.. 149 మరణాలు చోటుచేసుకున్నాయి. క్రియాశీల కేసులు 30వేల దిగువకు పడిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని