IMF: మహమ్మారి వేళ.. ఈ కేంద్ర పథకం మెరుగ్గా పనిచేసింది..!

రెండేళ్ల క్రితం భారత్‌లో అడుగుపెట్టిన కరోనా మహమ్మారి దేశ ప్రజల జీవన స్థాయులపై దెబ్బకొట్టింది. ఈ సమయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కితాబిచ్చింది.

Updated : 06 Apr 2022 12:24 IST

తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించింది: ఐఎంఎఫ్‌

దిల్లీ: రెండేళ్ల క్రితం భారత్‌లో అడుగుపెట్టిన కరోనా మహమ్మారి దేశ ప్రజల జీవన స్థాయులపై దెబ్బకొట్టింది. ఈ సమయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కితాబిచ్చింది. ‘పాండమిక్, పావర్టీ, ఇనీక్వాలిటీ: ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియా’ పేరిట ఐఎంఎఫ్‌ ఒక పత్రాన్ని విడుదల చేసింది.  

‘2019లో భారత్‌లో తీవ్ర పేదరికం ఒక శాతం( ఒక వ్యక్తికి రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ కొనుగోలు శక్తి) కంటే దిగువన ఉంది. 2020లో మహమ్మారి ఆ దేశంలో అడుగుపెట్టిన ఏడాదిలో కూడా అది స్థిరంగానే ఉంది. భారత్‌లో తీవ్రమైన పేదరిక స్థాయులు పెరగకుండా నిరోధించడంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కీలకంగా మారింది. కొవిడ్ షాక్‌లకు గురైన పేదల విషయంలో ఈ పథకం మెరుగ్గా పనిచేసింది. ఇలా తాత్కాలికంగా ఏర్పడిన ఆదాయ అంతరాల నుంచి బయటపడేసేందుకు తాత్కాలిక ఆర్థిక విధాన జోక్యం తగినది’ అని ఐఎంఎఫ్ వెల్లడించింది. 

కరోనా వేళ 2020 మార్చిలో కేంద్రం ఈ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనికింద దేశ ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించి, ఆహార భద్రతను కల్పించింది. ప్రస్తుతం ఈ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తున్నట్లు గత నెల ప్రధాని ప్రకటించారు. ఇక వరుసగా రెండు సంవత్సరాల పాటు తక్కువ స్థాయి పేదరికాన్ని తీవ్ర పేదరిక నిర్మూలనగా పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని