Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్‌ ఠాకూర్‌

న్యాయ ప్రక్రియను అనుసరించి బ్రిజ్‌భూషణ్‌పై (Brij Bhushan Sharan Singh) చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ( Anurag Thakur) వెల్లడించారు.

Published : 02 Jun 2023 17:16 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. ‘‘నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నందున న్యాయ స్థానం తీర్పు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. న్యాయప్రక్రియను అనుసరించే చర్యలు ఉంటాయి’’ అని దిల్లీలో నిర్వహించిన ఓ మీడియా కార్యక్రమంలో అనురాగ్‌ ఠాకూర్ తెలిపారు.

రెజ్లర్ల ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను సమర్పించిన తర్వాత ప్రస్తుతం ఈ కేసును దిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కేసులో పక్షపాత వైఖరికి తావులేదని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి దిల్లీ పోలీసులు త్వరలోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రెజ్లర్ల ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని, అంతేకాకుండా బ్రిజ్‌భూషణ్‌పై మోపిన ఆరోపణలపై విచారణకు ఓ ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసిందని అనురాగ్‌ ఠాకూర్‌ గుర్తు చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్‌ సంఘాన్ని కోరినట్లు చెప్పారు. అథ్లెట్లయినా, సాధారణ మహిళలైనా వేధింపులు ఎదుర్కొంటే.. వీలైనంత త్వరగా న్యాయం జరగాలని ఆయన అన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించారంటూ.. ఒలింపిక్‌, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన సాక్షిమాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, భజరంగ్‌ పునియా, సంగీత ఫొగాట్ తదితర అంతర్జాతీయ స్థాయి రెజర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని