Aadhaar: ఆధార్‌.. ఓటర్‌ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!

ఓటర్‌ ఐడీ- ఆధార్‌ సంఖ్యను అనుసంధానించని వారికి ప్రభుత్వం ఓ సానుకూల కబురు తెలిపింది. గడువును మరో ఏడాది పొడిస్తున్నట్లు వెల్లడించింది. 

Updated : 22 Mar 2023 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓటర్‌ కార్డు(voter ID )తో ఆధార్‌(Aadhaar) సంఖ్య అనుసంధానానికి  గడువును కేంద్రప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2023 ఏప్రిల్‌ 1  నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది జూన్‌ 17వ తేదీన న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం గడువు ఏప్రిల్‌ 1వ తేదీతో ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఓటర్లు ఫామ్‌ 6-బీను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్‌ రిజిస్టర్డ్‌ ఓటర్ల నుంచి ఆధార్‌ నంబర్లు సేకరించడం మొదలుపెట్టింది. డిసెంబర్‌ 12వ తేదీ వరకు 54.32 కోట్ల ఆధార్‌ సంఖ్యలను సేకరించినట్లు సమాచారం. కానీ, వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు కింద వెల్లడించారు.

మరోవైపు పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియకు తుది గడువును పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసింది. దీంతోపాటు రూ.1000 అపరాధ రుసుంను కూడా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్‌ - పాన్‌ అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగియనుంది.  ఒకవేళ ఇలా అనుసంధానం చేసుకోలేకపోతే పాన్‌ కార్డు పనిచేయదు. అయితే, ఇలా మార్చి 31, 2022 నాటికి ఉచితంగానే అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 1, 2022 వరకు పొడిగించిన ప్రభుత్వం జులై 1, 2022 నుంచి దాన్ని రూ. వెయ్యికి పెంచింది. తాజాగా ఆ గడువు కూడా దగ్గరపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని