చంద్రయాన్‌-3 వాయిదా

చంద్రుని చేరే ప్రయత్నంలో భారత్‌ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్‌ 3 వాయిదాపడింది.

Updated : 21 Feb 2021 17:29 IST

దిల్లీ: చంద్రుడిని చేరే ప్రయత్నంలో భాగంగా భారత్‌ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్‌ 3 వాయిదాపడింది. దీనిని 2022లో చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. 2019 సెప్టెంబరు నాటి చంద్రయాన్‌-2 ప్రయోగం తృటిలో విఫలమైనప్పటికీ.. పట్టు వదలకుండా ఇస్రో తన ప్రయత్నాలను కొనసాగించిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్‌-19 ప్రభావం చంద్రయాన్‌-3, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌తో సహా పలు ఇస్రో ప్రాజెక్టులపై పడినట్టు సంస్థ చైర్మన్‌ కే శివన్‌ వివరించారు. నిజానికి 2020 చివరిలో జరగాల్సిఉన్న ఈ ప్రయోగాలు.. వచ్చే సంవత్సరం సాకారం కావచ్చని ఆయన ప్రకటించారు.

‘‘ఈ విషయమై మేము పరిశోధనలు జరుపుతున్నాము. ఈ ప్రయోగం కూడా చంద్రయాన్‌-2 మాదిరిగానే ఉన్నా దీనికి ప్రత్యేక ఆర్బిటార్‌ ఉండకపోవటం విశేషం. చంద్రయాన్‌-2 సమయంలో ప్రయోగించిన ఆర్బిటార్‌నే దీనిలోనూ వాడనున్నాము. ఈ నేపథ్యంలో ఈ మిషన్‌ను వచ్చే 2022 సంవత్సరంలో ప్రయోగించేందుకు కృషి చేస్తున్నాము.’’ అని శివన్‌ తెలిపారు.

ఇస్రో భవిష్యత్తులో పలు గ్రహాంతర యాత్రలను చేపట్టనున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని చాటిచెప్పే గీటురాయిగా చంద్రయాన్‌-3 కీలకం కానుంది. ఈ ప్రయోగం అనంతరం ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్‌-3 ప్రాజెక్టుపై దృష్టి సారిస్తామని శివన్‌ తెలిపారు. ఇందుకుగానూ నలుగురు భారత వ్యోమగాములు  అవసరమైన శిక్షణ పొందుతున్నారని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని