18 నెలల చిన్నారికి పాముకాటు.. రోడ్డులేక 6 కి.మీలు నడుచుకుంటూ తీసుకెళ్లినా..!

మారుమూల ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు (Tamilnadu)లోని వేలూరులోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Updated : 29 May 2023 14:26 IST

చెన్నై: మారుమూల ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు (Tamilnadu) లోని వేలూరులోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన ఓ 18 నెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆ తల్లి కన్నబిడ్డను ఎత్తుకుని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లినా ఫలితం లేకపోయింది. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో దురదృష్టవశాత్తూ ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. వివరాల్లోకి వెళితే..

వేలూరుకు చెందిన 18 నెలల చిన్నారి ధనుష్క పాము కాటు (Snake Bite)కు గురైంది. దీంతో వెంటనే తల్లిదండ్రులు, బంధువులు ఆ పాపను వేలూరులోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ ప్రాంతంలో రోడ్డు సరిగా లేకపోవడంతో అంబులెన్స్‌ వారిని మార్గమధ్యంలోనే దించేసింది. దీంతో తల్లి ఆ బిడ్డను ఎత్తుకుని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే మార్గమధ్యంలో బాలిక మరణించింది.

రోడ్డు సరిగా లేకపోవడంతో సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక పసిపాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై వేలూరు కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆశా వర్కర్లను సంప్రదించి ఉంటే ప్రథమ చికిత్స జరిగేదని చెప్పారు. రోడ్డు వేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. పాప మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు