Tibetan unit: హఠాత్తుగా మేలుకొన్న చైనా..!

‘‘గల్వాన్‌, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది.

Published : 25 Jun 2021 17:47 IST

 భద్రతా దళాల్లోకి టిబెట్‌ వాసుల నియామకాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘‘గల్వాన్‌, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది.  అక్కడ సైనికులుగా సాధారణ పౌరులను తీసుకొంటారు. వారు స్వల్పకాలానికి మాత్రమే పనిచేస్తారు. దీంతో ఇలాంటి పర్వత ప్రాంతాల్లో విధి నిర్వహణకు చైనా ఇచ్చే శిక్షణ సరిపోదు. టిబెట్‌ భౌగోళికంగా చాలా కష్టమైంది. ఇక్కడ పని చేయాలంటే ప్రత్యేక శిక్షణ ఉండాలి. వాతావరణానికి అలవాటు పడాలి’’ అంటూ ఇటీవల చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే. ఈ విషయం చైనాకు గల్వాన్‌లో 16వ బిహార్‌ రెజిమెంట్‌, కైలాస్‌ రేంజ్‌లో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ ఇచ్చిన షాక్‌లతో అర్థమైంది.  కైలాస్‌ రేంజి శిఖరాల స్వాధీనం ఆపరేషన్‌లో పాల్గొన స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌లో ఉన్నవారు చాలా వరకు టిబెట్‌ నుంచి వలస వచ్చినవారే. ఆగస్టు 29 రాత్రి మెరుపు వేగంతో శిఖరాలను స్వాధీనం చేసుకొన్న తీరుకు చైనా బలగాలు బిత్తరపోయాయి. ఇప్పుడు వీలైనంత వరకు పర్వత ప్రాంతాలకు అలవాటు పడినవారినే తీసుకొనేందుకు చైనా వేగంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

నిరుద్యోగ టిబెట్‌ యువకులతో..

 టిబెట్‌లోని నిరుద్యోగ యువకులతో ‘వాలంటీర్‌ మిలీషియా’ను చైనా ఏర్పాటు చేస్తోంది. సిక్కిం సరిహద్దుల వెంట వీరిని నియమిస్తోందని భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సిక్కిం సమీపంలో ఉన్న యడాంగ్‌ కౌంటీలోని పోలీస్‌ శాఖ ఈ యువకులను రిక్రూట్‌ చేసుకొంటోంది. వీరిని పోలీస్‌, సైనిక కేంద్రాల్లో శిక్షణ నిమిత్తం తరలిస్తున్నారు.  చైనా ఈ యువకులను సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన గ్రామాల చెక్‌పోస్టుల వద్ద విధుల్లో నియమించనుంది. అంతేకాదు, సరిహద్దుల్లో నిఘా సమాచారం తెలుసుకోవడం, అవసరమైతే పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) విధులు కూడా నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో స్పెషల్‌ టిబెటియన్‌ ఆర్మీ యూనిట్‌ ఏర్పాటుకు ఏప్రిల్‌ నుంచి నియామకాలు చేపట్టింది. 

చుంబీ వ్యాలీలో తొలి యూనిట్‌

పీఎల్‌ఏ సిద్ధం చేసిన తొలి యూనిట్‌ను చుంబీవ్యాలీలో నియమించారు. మొత్తం ఒక్కోదానిలో 100 మంది సభ్యులతో రెండు బృందాలు విధుల్లో చేరాయి. శిక్షణ అనంతరం వీరిని టిబెట్‌లో భౌద్ద సన్యాసుల వద్దకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించారు. వాస్తవానికి పీఎల్‌ఏ ఎప్పుడూ ఇలా చేయదు. కానీ ఈ సారి కొత్తగా చేరినవారి మతపరమైన సెంటిమెంట్లను గౌరవించింది. ఇది కూడా టిబెట్‌ వాసుల నమ్మకం సంపాదించుకొనే వ్యూహంగా అనుమానిస్తున్నారు. ఈ కొత్త బ్యాచులను చుంబీ వ్యాలీలోని యటుంగ్‌, చీమ, రించెన్‌గాంగ్‌, పీబీ థాంగ్‌, పహారి ప్రాంతాల్లో నియమిస్తారు. వీరందరూ స్పెషల్‌ టిబేటియన్‌ ఆర్మీ యూనిట్‌ కిందకు వస్తారు. వీరికి ఇక్కడి భౌగోళిక స్థితి, వాతావరణం, వనరులు వంటి వాటిపై ఎక్కువ అవగాహన ఉండటం కలిసొచ్చే అంశం. 

పీఎల్‌ఏ బలహీనతే అది..

అతి శీతల పరిస్థితుల్లో పని చేయడం పీఎల్‌ఏ సైనికులకు పెద్దగా అలవాటు లేదు. ఇటీవల సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ చెప్పింది కూడా అదే. ఈ చలిలో  గాయాలు కాకూడదు. పొరబాటున లోహాలను చేతులతో పట్టుకుంటే గాయపడక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అక్యూట్‌ మౌంటెన్‌ సిక్‌నెస్‌, హైఆల్టిట్యూడ్‌ పల్మనరీ ఎడిమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చైనా సైనికులు ఆక్సిజన్‌ అందించే ప్రత్యేక గదుల్లో ఉంటారు. చైనా వారిని చలి వాతావరణానికి అలవాటు పడనివ్వలేదు.  2,500 నుంచి 3,000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రదేశాల్లో అడుగుపెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి, వాతావరణంలోని ఆక్సిజన్‌ 30శాతం వరకు పడిపోతుంది. చైనా సైన్యంలో చాలామంది కాలేజీ విద్యార్థుల వయస్సువారే ఉండటం.. ఈ వాతావరణానికి తగిన శిక్షణ లేకపోవడం.. అలవాటు పడేలోపే వారిని మార్చేయడం.. ఇలాంటి కారణాలతో కుదురుకోలేకపోతున్నారు. దీంతో ఈ బలహీనతను అధిగమించేందుకు ఇప్పుడు ఆ దేశం ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని