అరుణాచల్‌లో చైనా హల్‌చల్‌

పొరుగు దేశ భూభాగాల ఆక్రమణ పర్వాన్ని చైనా యథేచ్ఛగా కొనసాగిస్తోంది.

Updated : 19 Jan 2021 11:37 IST

 101 ఇళ్లతో గ్రామం నిర్మాణం
 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొరబాటు 
 
ఉపగ్రహ చిత్రాల్లో బట్టబయలు

 గమనిస్తూనే ఉన్నాం: కేంద్రం

దిల్లీ: పొరుగు దేశ భూభాగాల ఆక్రమణ పర్వాన్ని చైనా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్ని కూడా డ్రాగన్‌ నిర్మించినట్లు తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆ గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది భారత్‌కు ఆందోళనకర అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ సుభాన్‌సిరి జిల్లాలో సారి చు నది ఒడ్డున ఈ గ్రామం వెలిసింది. ఈ ప్రాంతంపై భారత్, చైనాల మధ్య వివాదం ఉంది. గతంలో ఇక్కడ యుద్ధం కూడా జరిగింది. గత ఏడాది నవంబరు 1న తీసిన ఉపగ్రహ చిత్రంలో ఈ గ్రామం కనిపించింది. 2019 ఆగస్టులో అది లేదు. ఆ ప్రాంతంలో చైనా సైనిక శిబిరానికి కొద్దిదూరంలో ఈ గ్రామం ఉంది. ఆ శిబిరాన్ని కూడా గత దశాబ్ద కాలంలో గణనీయంగా ఆధునికీకరించారు. 

తమ దృష్టికి వచ్చింది: భారత్‌

సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొన్ని నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత ప్రభుత్వం పేర్కొంది. తాము కూడా సరిహద్దుల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నట్లు పేర్కొంది. వీటివల్ల స్థానికులకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపడుతున్నట్లు పేర్కొంది. సరిహద్దు ప్రాంతంలో భారత్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు సైనిక మోహరింపులనూ పెంచుతోందని గత ఏడాది అక్టోబరులో చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. కొన్ని నెలలుగా సాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు ఇదే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే తాజా గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడా భారత రోడ్లు, ఇతర మౌలిక వసతులు లేకపోవడం గమనార్హం. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ తాపిర్‌ గావో కూడా గత ఏడాది నవంబరులో ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. చైనా తమ రాష్ట్రంలోకి చొరబాట్లు సాగిస్తోందని ఆరోపించారు. డబుల్‌లేన్‌ రోడ్డును నిర్మిస్తోందని తాజాగా ఆయన పేర్కొన్నారు. నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. నది వెంబడి పరిశీలనలు సాగిస్తే 60-70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. లెన్సి అనే ఒక నది పక్కన  రోడ్డును నిర్మిస్తోందని చెప్పారు.
ఇవీ చదవండి...

ట్రంప్‌ ఆంక్షల్ని ఎత్తేశారు.. బైడెన్‌ కుదరదన్నారు!
కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని